
నేను హైకోర్టు లాయర్.. నేను కాబోయే కలెక్టర్..
హైకోర్టులో గుమాస్తా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒకామె, కలెక్టరేట్లో క్లర్క్ పోస్టులు ఇప్పిస్తానని ఆయన..
► అమాయకులనుబురిడీ కొట్టించిన భార్యభర్తలు
► ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు
► పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: హైకోర్టులో గుమాస్తా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒకామె, కలెక్టరేట్లో క్లర్క్ పోస్టులు ఇప్పిస్తానని ఆయన.. ఇద్దరూ కలిసి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొని పరారీలో ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆ దంపతులిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్న సమయంలో మలక్పేట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం భీమా రం గ్రామానికి చెందిన బిటుకు రాజలింగం(45), బిటుకు ప్రసన్న(40) భార్యభర్తలు. తేలికగా డబ్బు సంపాదించే మార్గానికి తెరలేపారు. హైకోర్టులో తాను లాయర్ను అంటూ ప్రసన్న నమ్మించి అక్కడ క్లర్క్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.4 నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేసింది. తాను రెండు రోజుల్లో కలెక్టర్గా అపాయింట్ కాబోతున్నానని ఉద్యోగాల పేరుతో రాజలింగం కూడా ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని అనుష్క కుక్కూస్ అనే ఖరీదైన అపార్ట్మెంట్లో నెలకు రూ.75 వేల అద్దెతో కిరాయికి దిగారు. ఒక బీఎండబ్ల్యూ కారును కూడా అద్దెకు తీసుకున్నారు. వెంట ఇద్దరు గన్మెన్లను నియమించుకున్నారు. కారు డ్రైవర్, ఇంట్లో పని మనుషులు ఇలా అట్టహాసం చూపించారు. ఇదంతా నమ్మిన ప్రభుకిరణ్, రంగారా వు, ఎన్. బ్రహ్మలింగం, పి.నానాజీ, చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాలో బాధితులున్నారు. వీరంతా లక్షల రూపాయలు చెల్లించారు. హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్లు, క్లర్క్లు, గుమస్తాలు ఇలా రకరకాల ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకున్నారు. నెల రోజుల్లోనే అపార్ట్మెంట్ ఖాళీచేసి పరారయ్యారు. బాధితులు ప్లాట్ వద్ద కు వచ్చి చూడగా ఖాళీ చేసినట్లు తేలింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది.
మోసపోయామని తెలుసుకొని బాధితులంతా పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు, రాజలింగం, ప్రసన్నలపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. శని వారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు వీరి ఆచూకీ లభించగానే వెంబడించారు. సిగ్నల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారులో తప్పించుకున్నారు. అయితే కొద్ది దూరంలోనే మాటువేసిన మలక్పేట పోలీసులకు చిక్కినట్లు తేలడంతో బంజారాహిల్స్ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి మోసాలు పెద్ద సంఖ్యలో వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారుగా 40 మందిని మోసం చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నా యి. వీరిద్దరినీ తమ కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.