మన టీవీ వీక్షకులు 10 లక్షల మంది | Group-2 Coaching program extends for another week | Sakshi
Sakshi News home page

మన టీవీ వీక్షకులు 10 లక్షల మంది

Oct 20 2016 7:43 PM | Updated on Sep 4 2017 5:48 PM

మన టీవీ ద్వారా ప్రసారమవుతున్న గ్రూప్-2 శిక్షణ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది.

- గ్రూప్-2 ప్రత్యక్ష ప్రసారాలు మరో వారం పొడిగింపు
- కేబుల్ ఆపరేటర్లకు ఆర్‌వోటీ సరఫరా


హైదరాబాద్: మన టీవీ ద్వారా ప్రసారమవుతున్న గ్రూప్-2 శిక్షణ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లో 10 వేల మంది సబ్‌స్క్రైబర్లు నమోదుకాగా, దాదాపు 10 లక్షల మంది వీక్షించారని మన టీవీ సీఈవో శైలేష్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ముందుకొచ్చి కేబుల్ ద్వారా మన టీవీ ప్రసారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన మరో 13 జిల్లాలకు ప్రసారాలు విస్తరించాయని, మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాచలం వంటి జిల్లాలకు త్వరలోనే ప్రసారాలను విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆయా ప్రాంతాల్లో మన టీవీ ప్రసారాలు అందుకోలేని కేబుల్ ఆపరేటర్లకు ఆర్వోటీ (రిసీవ్ ఓన్లీ టర్మినల్) డిష్‌లను ఐటీ శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్-2 అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కొనసాగిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న ఆదరణకు తగ్గట్లుగానే నాణ్యత పెంచడంతోపాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రసారాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement