ఫిబ్రవరిలో ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం

Published Thu, Dec 3 2015 7:04 PM

ghantasala musical Celebration at rajahmundry in february

రాజమండ్రి కల్చరల్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 13, 14 తేదీల్లో రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో 24 గంటల నిర్విరామ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్ కార్యదర్శి మద్దాలి రఘురామ్ వెల్లడించారు. స్థానిక ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి గాయనీ గాయకులు బృందాలుగా కానీ, విడిగా కానీ ఘంటసాల పాటలు ఆలపిస్తారన్నారు. ఇందుకోసం ఘంటసాల పాటలు పాడిన 200 సినిమాలను ఎంపిక చేశామని తెలిపారు. ఒకరు పాడిన పాటను మరొకరు పాడరాదన్నారు. మూడు ఆర్కెస్ట్రా బృందాలు పాల్గొంటాయన్నారు.

14న జరిగే ముగింపు ఉత్సవంలో ఘంటసాల అర్ధాంగి సావిత్రమ్మ, తనయుడు రత్నకుమార్, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సినీ సంగీత దర్శకుడు ఆనంద్ తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పాల్గొనగోరే గాయనీ గాయకులు 98660 57777 సెల్ నంబర్‌లో సంప్రదించాలని రఘురామ్ కోరారు. విలేకరుల సమావేశంలో సినీ విజ్ఞాన విశారద ఎస్‌వీ రామారావు, నటుడు, గాయకుడు జిత్‌మోహన్ మిత్రా, ‘కిన్నెర’ కోశాధికారి కేవీ సుబ్బారావు కె.వెంకటేశ్వరరావు, సాహితీవేత్త ఫణి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement