ఫేస్‌క్రీమ్స్‌తో పనిలేదు! | Sakshi
Sakshi News home page

ఫేస్‌క్రీమ్స్‌తో పనిలేదు!

Published Sun, Dec 2 2018 2:03 AM

Funday beauty tips of the week dec 1 2018 - Sakshi

మేకప్‌తో వచ్చే అందం కంటే.. మేకప్‌ వేయకుండా మెరిసే అందానికే ఓటేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఖర్చులేని ఈ చిట్కాలను పాటించడానికి మాత్రం కాసింత సమయం వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ముందుగా క్లీనప్, స్క్రబ్‌ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. 

కావల్సినవి : క్లీనప్‌ : ఆలీవ్‌ నూనె – పావు టీ స్పూన్, దానిమ్మ జ్యూస్‌ – 2 టీ స్పూన్లు(చెత్త తొలగించి), బాదం పాలు – 1 టీ స్పూన్‌ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్‌లో నిలువ చేసుకోవచ్చు.) స్క్రబ్‌ : దానిమ్మ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఆరెంజ్‌ జ్యూస్‌ – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పచ్చిపసుపు – పావు టీ స్పూన్‌ మాస్క్‌ : గడ్డ పెరుగు – 2 టీ స్పూన్లు, యాపిల్‌ గుజ్జు – 3 టీ స్పూన్లు, పెసరు పిండి – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్‌

తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్, బాదం పాలు, ఆలీవ్‌ నూనె ఒక బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, బియ్యప్పిండి, ఆరెంజ్‌ జ్యూస్, పచ్చి పసుపు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, యాపిల్‌ గుజ్జు, పెసరు పిండి, నిమ్మరసం ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. వెంటనే సబ్బు ముఖానికి రాసుకోకపోవడమే మంచిది. 

Advertisement
Advertisement