భోజనం ఒంటరిగా వద్దు | Do not want meals alone | Sakshi
Sakshi News home page

భోజనం ఒంటరిగా వద్దు

Nov 2 2017 1:16 AM | Updated on Nov 2 2017 6:09 AM

 Do not want meals alone - Sakshi

వేళకు భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. నలుగురితో కలసి కబుర్లు చెప్పుకుంటూ తింటే తృప్తిగా ఉంటుంది. ఒంటరిగా తింటే అది షడ్రసోపేతమైన భోజనమే అయినా తిన్న తృప్తి ఉండదు. చాలామందికి ఈ విషయం అనుభవపూర్వకంగా తెలిసే ఉంటుంది. అయితే, ఒంటరిగా భోజనం చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషులకు ఒంటరి భోజనం మరింత అనర్థదాయకమని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఒంటరిగా భోంచేసే పురుషులకు తినే పదార్థాల మీద ఆసక్తి గాని, తిండి మీద నియంత్రణ గాని ఉండకుండాపోతుందని, దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే వారి జీవక్రియల్లో ప్రతికూల మార్పులు తలెత్తి స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడతారని సియోల్‌లోని డాంగ్‌జుక్‌ యూనివర్సిటీ పరిధిలోని ఇల్సాన్‌ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా భోజనం చేసే 7,745 మంది వయోజనులపై జరిపిన దీర్ఘకాలిక అధ్యయనం తర్వాత వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా భోంచేసే పురుషుల్లో 64 శాతం మంది జీవక్రియల లోపాలకు గురవుతున్నారని, మహిళల్లో వారి సంఖ్య 29 శాతం మాత్రమేనని ఈ పరిశోధనలో తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement