కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆర్థిక నేరస్థుడని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కర్నూలు అభ్యర్థి ఎం.ఏ. గఫూర్ ఆరోపించారు.
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆర్థిక నేరస్థుడని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కర్నూలు అభ్యర్థి ఎం.ఏ. గఫూర్ ఆరోపించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీజీ అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, లక్షల టన్నుల పొటాషియం క్లోరైడ్ను దుబాయి నుంచి రైతుల పేరిట తన పరిశ్రమల అవసరాలకు దిగుమతి చేయించుకుంటున్నారని వెల్లడించారు. టన్ను రూ. 30 వేల విలువ చేసే పొటాషియం క్లోరైడ్ను రూ. 4,500కే కొనుగోలు చేస్తున్నారని, రైతుల పేరుతో కొనుగోలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మిగిలిన రూ. 25,500ను సబ్సిడీగా భరిస్తోందన్నారు.
ఇతర కేసుల్లో ఎక్సైజ్ డ్యూటీ రూ. 90 లక్షలు చెల్లించారని, అయినా ఆ వివరాలను ఆయన అఫిడవిట్లో చూపలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని తన సొంత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న టీజీ నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఆయనపై సీబీఐ విచారణ జరిపించి పరిశ్రమలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.