తెలంగాణ రాష్ట్ర సమితి వివాదాలకు ఉత్పత్తి కేంద్రంగా మారిందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో రెచ్చగొట్టడంలో కేసీఆర్ నాలుకకు కూడా అంత పేరుందని పేర్కొన్నారు.
రుచికి ఇది.. వివాదాలకు అది చాలా ఫేమస్: జైరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వివాదాలకు ఉత్పత్తి కేంద్రంగా మారిందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో రెచ్చగొట్టడంలో కేసీఆర్ నాలుకకు కూడా అంత పేరుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఉద్యోగుల విభజన సమస్యే కాదని... అయినప్పటికీ కేసీఆర్ ఈ అంశాన్ని వివాదం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
గాంధీభవన్లో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్తో కలిసి జైరాం మీడియాతో మాట్లాడారు. దళితుల భూమిని పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలు తన దృష్టికి రాలేదన్న జైరాం.. తెలంగాణలో అతిపెద్ద భూస్వామి కేసీఆరేనని, ఫాంహౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాహుల్గాంధీ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ కోసం ప్రయత్నిస్తుంటే.. కేసీఆర్ టీఆర్ఎస్ను వివాదాల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తున్నారని విమర్శించారు. జూన్ 2లోపు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉద్యోగుల తాత్కాలిక (ప్రొవిజనల్) కేటాయింపు జరుగుతుందని చెప్పారు.