పవన్‌కు పౌరుషం ఉందా? | any have pavan Enhancement? | Sakshi
Sakshi News home page

పవన్‌కు పౌరుషం ఉందా?

May 3 2014 12:51 AM | Updated on Jul 6 2019 3:48 PM

పవన్‌కు పౌరుషం ఉందా? - Sakshi

పవన్‌కు పౌరుషం ఉందా?

‘రాయలసీమ పౌరుషం అంటూ పవన్ కల్యాణ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన అనుచరుడైన ఒక టీడీపీ ముఖ్యనేత చేతిలో పవన్ కల్యాణ్‌కు తీరని అవమానం జరిగింది.

టీడీపీ నేత చేతిలో జరిగిన అవమానమేంటో చెప్పాలి  ధ్వజమెత్తిన మైసూరారెడ్డి
 
 
వైఎస్ వల్లనే తెలంగాణ ఉద్యమం అనడం అవగాహనా రాహిత్యం
కాంగ్రెస్ అసమర్థత, టీడీపీ కుమ్మక్కు రాజకీయాల ఫలితంగానే రాష్ట్ర విభజన
విభజనకు బీజేపీ పూర్తిగా సహకరించింది
మోడీ, బాబు, పవన్‌లది అవకాశవాదం

 
 
హైదరాబాద్: ‘‘రాయలసీమ పౌరుషం అంటూ పవన్ కల్యాణ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన అనుచరుడైన ఒక టీడీపీ ముఖ్యనేత చేతిలో పవన్ కల్యాణ్‌కు తీరని అవమానం జరిగింది. ఆ సంఘటన ఏమిటో, అప్పుడీ పౌరుషం ఏమైందో రాష్ట్ర ప్రజలకు వివరించాలి..’’ అని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పౌరుషం అనేంత పెద్ద మాటలు తాను మాట్లాడలేనని, కానీ పవన్ మాదిరిగా తనకు అవమా నం జరిగి ఉంటే కోట్లాది రూపాయలు కాదు కదా, తన ఎత్తు బంగారం రాసి పోసినా అలా అవమానించిన తాలూకు వ్యక్తులతో వేదిక పంచుకునేవాడిని కాదని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనవల్లే తెలంగాణ ఏర్పాటు జరిగిందని పవన్ చెప్పడం ఆయన అవగాహ నా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక టీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన పదిమంది ఎమ్మెల్యేలు కూ డా కాంగ్రెస్‌లో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు అప్పట్లో పత్రికల్లో వార్తలొచ్చాయని గుర్తు చేస్తూ... వైఎస్ మరణించాక కాంగ్రెస్ అసమర్థత, చేతగానితనంవల్ల, టీడీపీ కుమ్మక్కు రాజకీయాల ఫలితంగానే రాష్ట్ర విభజన జరిగిందని వివరించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

  చంద్రబాబు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాతనే టీడీపీలో కొందరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్‌తో ఒక బృందంగా ఏర్పడ్డారని శ్రీకృష్ణకమిటీ నివేదికలోని 194వ పేజీలో వివరించారు (అందుకు సంబంధించిన ప్రతులను మైసూరా పత్రికలకు విడుదల చేశారు). తర్వాత ఒక్క ఓటు రెండు రాష్ట్రాలనే నినాదాన్ని బీజేపీ తెరమీదకు తెచ్చింది. ఆ తరువాత ఎన్డీయే ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఇచ్చింది. ఆ స్ఫూర్తితో 2001లో టీడీపీ అసమ్మతి నేత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని ఈ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఈ వాస్తవాలన్నింటినీ మర్చిపోయి విభజన వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగట్టడం గర్హనీయం.

  రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరించింది బీజేపీ. తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు తెలంగాణ ఇస్తామని ప్రకటించిన పార్టీ అది. రాష్ట్రాన్ని విభజించండి అంటూ ఒకటికి రెండుసార్లు లేఖలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తులతో వేదిక పంచుకుని వైఎస్సార్‌సీపీకి, టీఆర్‌ఎస్‌కు సంబంధాలున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించడం పెద్దోళ్ల అమాసకు పీర్ల పండుగకు ముడిపెట్టినట్లుంది. పవన్ విమర్శల్లో నిజం నేతిమీరకాయలో నెయ్యి చందమే.

  తెలంగాణకు తొలుత లేఖ ఇచ్చింది తానేనని ఒప్పుకుంటూ వరంగల్‌లో జరిగిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ కోసం బీజేపీ ఎంతో పోరాటం చేసిందని మోడీ తెలంగాణ సభల్లో చెప్పారు. కాంగ్రెస్ వీపు మీద గుద్ది బీజేపీయే తెలంగాణ తెచ్చిందని సాక్షాత్తూ పవనే ఇటీవల చెప్పారు. వీరు ముగ్గురూ సీమాంధ్రకు వెళ్లి ఈ ప్రాంతాన్ని రక్షించేది తామేనని చెప్పడం.. రెండు నాల్కల ధోరణికి, అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అయినా రాజకీయ పార్టీ పెట్టుకున్నవాడు ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారం చేసుకోవాలి గానీ ఇతరులను విమర్శించడానికే పార్టీ పెట్టడం ఏమిటి?

  పవన్ వాలకం చూస్తూంటే ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అనుకుంటున్నట్లుగా ఉంది. డబ్బు కోసం సినిమా డైలాగులు చెప్పినట్లు రాజకీయాల్లోనూ మాట్లాడుతున్నారు. పవన్ ప్రజారాజ్యంలో ఉండగా... అవినీతి గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు, బాబుది పొలిటికల్ ర్యాగింగ్, అవినీతి కిటికీలు తెరిచింది బాబే, అదొక దగా కూటమి, టీడీపీ కాగితపు పువ్వు అని చంద్రబాబును, టీడీపీని విమర్శించడం మరిచారా? జూనియర్ ఎన్టీఆర్ సభలకు వస్తున్న స్పందన చూసి పవన్ మరింత తాగుతారంటూ చంద్రబాబు చేసిన విమర్శలు గుర్తులేవా?
  తండ్రి ఆశయాల సాధన కోసం జగన్ పెట్టిన పార్టీకి ఆయన తల్లి విజయమ్మ సహకరించడం తప్పేమీ కాదు. పవన్ లాంటి వారు ఎన్ని చిందులు వేసినా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తుంది. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.
 
 

Advertisement
 
Advertisement
Advertisement