‘విశ్వనాథ’ది కవితారూపంలోని తపస్సు | viswantha kavitha rupam | Sakshi
Sakshi News home page

‘విశ్వనాథ’ది కవితారూపంలోని తపస్సు

Sep 10 2016 9:46 PM | Updated on Sep 4 2017 12:58 PM

‘విశ్వనాథ’ది కవితారూపంలోని తపస్సు

‘విశ్వనాథ’ది కవితారూపంలోని తపస్సు

సనాతన ధర్మప్రతిష్ఠకు అవతరించిన మహాయోగి కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ అని, ఆయన కవితారూపక తపస్సు చేశారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. తెలుగురథం సంస్ధ ఆధ్వర్యంలో శనివారం త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో జరిగిన విశ్వనాథ సాహితీసమాలోచనంలో సామవేదం పాల్గొని ప్రసంగించారు.

  • ‘సాహితీ సమాలోచనం’లో సామవేదం 
  • పాల్గొన్న అతిరథ మహారథులు
  •  
    రాజమహేంద్రవరం కల్చరల్‌ : 
    సనాతన ధర్మప్రతిష్ఠకు అవతరించిన మహాయోగి కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ అని, ఆయన కవితారూపక తపస్సు చేశారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. తెలుగురథం సంస్ధ ఆధ్వర్యంలో శనివారం త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో జరిగిన విశ్వనాథ సాహితీసమాలోచనంలో సామవేదం పాల్గొని ప్రసంగించారు. విశ్వనాథ వాజ్ఞ్మయమంతా సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిందని, వేదాలలో, వేదాంతంలో విమలార్థాలను ప్రకటించడానికి వచ్చిన సరస్వతీ స్వరూపమే విశ్వనాథ అని అన్నారు.‘సద్యోనిర్గతమైన సర్వ కవితాసంరంభాన్ని’ ఆయన భగవంతునికి నివేదన చేశారు. జీవిత లక్షణాలయిన చావుపుట్టుకల విషవలయంనుంచి బయటపడటానికే ఆయన కవిత్వాన్ని నమ్ముకున్నారు. ‘శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్‌’ అన్న పోతనామాత్యుని లాగే ఆయన రామాయణ కల్పవృక్షాన్ని మోక్షసాధనకు రచించారని తెలిపారు.‘రామాయణ కల్పవృక్షం లోకానికి కావ్యం, నాకు సాధన’ అని  విశ్వనాథ స్వయంగా పేర్కొన్నారని వివరించారు. భాగవత విరించి డాక్టర్‌ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ శ్రీశ్రీ ‘నాకు సంస్కృతం రాదు, వాల్మీకి రామాయణం అర్థమవుతుంది,తెలుగు వచ్చు, విశ్వనాథ కల్పవృక్షం అర్థం కాదు’ అనేవారని గుర్తు చేశారు. విశ్వనాథ రచించిన కల్పవృక్షం గురించి మాట్లాడాలంటే అది వాగ్రూపమైన ఒక సత్రయాగ మవుతుందన్నారు. ‘జీవుని వేదన’ అనే మాటను పట్టుకుని ఆయన కల్పవృక్షాన్ని నిర్మించారని తెలిపారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ సాహితీ విరాడ్రూపం విశ్వనాథ అని, ఎందరు ఎన్ని రూపాలలో ఆయన కవిత్వాన్ని ఆవిష్కరించినా, చెప్పవలసింది ఇంకా మిగిలే ఉంటుందని అన్నారు. ఆదాయపుపన్నుశాఖ అధికారి ఓలేటి రామావతారం మాట్లాడుతూ 20వ శతాబ్దపు వటవృక్షం విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. ఆయన స్ప­ృశించని సాహితీ ప్రక్రియ లేదన్నారు.తెలుగు రథం ప్రతినిధి కొంపెల్ల శర్మ ప్రసంగించారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ విశ్వనాథ కవితావైభవాన్నివిపులంగా వర్ణించారు. ప్రముఖ ఆడిటర్‌ వి.భాస్కరామ్, కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పలువురు సాహిత్యాభిమానులు హాజరయ్యారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement