చేనేతను విస్మరించిన చంద్రబాబు | shankarnarayana fires on chandrababu | Sakshi
Sakshi News home page

చేనేతను విస్మరించిన చంద్రబాబు

Sep 13 2017 10:08 PM | Updated on May 29 2018 3:42 PM

చేనేతను విస్మరించిన చంద్రబాబు - Sakshi

చేనేతను విస్మరించిన చంద్రబాబు

చేనేత రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు.

ధర్మవరం: చేనేత రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. సంక్షోభంలో ఉన్న చేనేతరంగాన్ని ఆదుకోవడానికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చేనేత ముడిపట్టు  రాయితీ బకాయిలు చెల్లించాలని కోరుతూ ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు మూడోరోజు బుధవారం కూడా కొనసాగాయి. దీక్షలకు మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో కలసి శంకరనారాయణ హాజరై సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ, ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి చేనేతలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు మగ్గం షెడ్లు నిర్మించి ఇస్తామని, చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000 పెంచుతున్నట్లు చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారన్నారు. ఆరు నెలలు రూ.1000 చొప్పున రాయితీ ఇచ్చి.. ఆ తరువాత పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే చేనేత కార్మికులతో జిల్లా కేంద్రంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రిలేదీక్షల్లో 22వ వార్డు ఇన్‌చార్జ్‌ కత్తే పెద్దన్న, మహబూబ్‌బాషా, శ్రీరామిరెడ్డి, శ్రీనివాసులు, మహమ్మద్‌రఫి, మధుసూదన్‌రెడ్డి, దస్తగిరి, చౌడయ్య, బయన్న, రాజా, పెద్దిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వీరేష్, బాబు, నరేష్, లోకేష్, అమీర్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, అక్కులప్ప, శీనా, నారాయణస్వామి, గోపాల్, నారాయణస్వామి, బాబు, పెద్దనాయుడు, నాగరాజు, గంగ, అమరనాథ, జిక్రియ, చంద్ర, లక్ష్మినారాయణ, హుస్సేన్, నాగరాజు, దాసు, లక్ష్మినారాయణ, శ్రీరాములు,  గోపినాథ్, శివ, జగన్, పెద్ద చౌడయ్యలు కూర్చున్నారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్‌ చందమూరి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement