స్కానింగ్‌ సేవలు మెరుగుపరుస్తాం | sakshi effect of scanning centre in government hospital | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సేవలు మెరుగుపరుస్తాం

Aug 12 2017 10:47 PM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్కానింగ్‌ సేవలు మెరుగుపరుస్తామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ తెలిపారు.

సాక్షి ఎఫెక్ట్‌
అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్కానింగ్‌ సేవలు మెరుగుపరుస్తామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ తెలిపారు. రేడియాలజిస్టుల కొరత, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కోసం వచ్చిన గర్భిణులు పడుతున్న కష్టాలపై ‘నిరీక్షణ..ఓ పరీక్ష’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. గైనిక్‌ విభాగం ఇన్‌చార్జ్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ సంధ్య, రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ దీపను తన చాంబర్‌కు పిలిపించి పరిస్థితిపై ఆరా తీశారు. లిఖిత పూర్వకంగా సంజాయిషీ కోరారు. స్కానింగ్‌ సేవల్లో జాప్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఇదే సమయంలో అనధికారికరంగా సెలవులో వెళ్లిన డాక్టర్‌ వసుంధర, డాక్టర్‌ పద్మలపై చర్యలకు డీఎంఈకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

స్కానింగ్‌ గదిలో ప్రత్యేక బెంచీలు : అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ గది వద్ద నిత్యం పెద్ద సంఖ్యలో గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్తులు నిరీక్షిస్తుండటాన్ని సీరియస్‌గా పరిగణించిన డాక్టర్‌ జగన్నాథ్‌ తక్షణ చర్యలు చేపట్టారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మన్నను పిలిపించి అల్ట్రాసౌండ్‌ గదిలో ప్రత్యేకంగా బెంచీలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ ఫరూక్‌ను పిలిపించి స్కానింగ్‌ గది వద్ద రోగుల బంధువులు కూర్చోకుండా చూడాలని ఆదేశించారు. స్కానింగ్‌కు వచ్చే వారికి ప్రత్యేకంగా టోకెన్‌ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. దీంతో శనివారం పరీక్షల కోసం వచ్చిన వారికి టోకన్లు ఇచ్చి గది బయట వేచి చూడకుండా లోపల కూర్చునే ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement