సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు | rs.110 crore for substations | Sakshi
Sakshi News home page

సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు

Jun 24 2016 1:36 AM | Updated on Mar 28 2018 11:26 AM

సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు - Sakshi

సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు

జిల్లాలో 50 విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు.

ఇకపై లో ఓల్టేజీ సమస్య పూర్తిగా తీరుతుంది
ఇప్పటికే రైతులకు 9గంటలు విద్యుత్ ఇస్తున్నాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

 చేవెళ్ల రూరల్: జిల్లాలో 50 విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల మండలం ముడిమ్యాలలో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, రేగడిఘనాపూర్‌లో కొత్తగా నిర్మించే 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిరంతర కరెంట్, రైతులకు 9 గంటల సరఫరాను అందిస్తున్నామని చెప్పారు. దీని వల్ల జిల్లాలోని లక్షా 10వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఎస్సీ, ఎస్టీలకు చార్జీల మాఫీ చేశామని మంత్రి చెప్పారు. జిల్లాలోని తూర్పు డివిజన్‌లో 9 సబ్‌స్టేషన్‌లకు రూ.22కోట్లు, ఉత్తర డివిజన్‌లో 14 సబ్‌స్టేషన్‌లకు రూ.53కోట్లు, పశ్చిమ డివిజన్‌లో రూ.17 సబ్‌స్టేషన్‌లో రూ.34 కోట్లు కేటాయించామన్నారు.

ఇంకా 37 విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 8 సబ్‌స్టేషన్‌లకు గాను రూ.17 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌ల ఏర్పాటుతో  వినియోగదారులకు లో ఓల్టేజీ  సమస్య ఉండదన్నారు.  బంగారు తెలంగాణ సాధనలో ప్రజలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తేనే ఆ కల నేరవేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ శ్రీరామలు, డీఈ దుర్గారావు, ఏఈ అశోక్‌రావు, సర్పంచులు కోరే సువర్ణ, తిప్పని రాంరెడ్డి, ఎంపీసీటీ సభ్యులు బుర్ల సుమలత, శ్రీలత, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement