క్రమబద్ధీకరణ ఎప్పుడో? | permanent agitation of contract employees | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ ఎప్పుడో?

Jul 24 2016 9:09 PM | Updated on Sep 4 2017 6:04 AM

ధికారం చేపడితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ రూపుదాల్చలేదు.

 
ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు
తెలంగాణలో సంబరాలు... ఇక్కడ నిట్టూర్పులు
టీడీపీ హామీ విస్మరించిందంటూ సర్వత్రా విమర్శలు
 
గుంటూరు వెస్ట్‌:  అధికారం చేపడితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ రూపుదాల్చలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపశమనం లభించలేదు.  క్రమబద్ధీకరణ కోసం నియమించిన కమిటీ సమావేశాల పేరుతో కాలయాపన చేయడం మినహా సాధించిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం సుమారు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగుల కుటుంబంలోని సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంబరాలు నిర్వహిస్తోంది.  
కమిటీతో కాలక్షేపం
  రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 13,671 మంది, ప్రభుత్వరంగ సంస్థల్లో 43,043 మంది మొత్తంగా 56,714 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరుకాక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 50 వేల మంది ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకష్ణుడు నేతత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీని నియమించింది. కమిటీ ఇప్పటికే రెండు మూడుసార్లు భేటీ అయినా ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్న కమిటీ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో సక్రమంగా స్పందించకపోవడంపట్ల ఉద్యోగుల నుంచి తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
చిత్తశుద్ధి ఏదీ...
   గుంటూరు జిల్లాలో సుమారు 803మంది, కష్ణాజిల్లాలో 442మంది వరకూ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా  రెవెన్యూ, మెడికల్, వ్యవసాయశాఖ, ఆర్‌అండ్‌బీ, డ్వామా, డీఆర్‌డీఏ, శిశు, మహిళా, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖలు తదితర ప్రభుత్వశాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్‌ సబార్డినేట్స్, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితర హోదాల్లో పనిచేస్తున్నారు.  జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్టుకు నెలకు రూ.8400, ఆఫీసు సబార్డినేట్‌కు రూ.7 వేలు చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా పాలకులు వాటిని విస్మరిస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల  వేతనాలు పెంచినప్పటికీ ఇందుకు సంబంధించిన జీఓ ఇంకా విడుదల కాకపోవడం,  రెండు, మూడునెలలకొకసారి జీతాలు అందిస్తుండడం తమ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు?
ఓ కాంట్రాక్టు ఉద్యోగి
  20 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉంది. ఇప్పుడు బైటకు వెళ్లి మరో ఉద్యోగం చేయలేని పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తమ జీతాలు పెంచుకుంటూ లక్షల రూపాయలు పొందుతున్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటు ఉంటూ విధులు నిర్వహించే మాకు అరకొర జీతాలే. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేశాం. టీడీపీ అధికారం చేపట్టాక కాంట్రాక్టు ఉద్యోగులను విస్మరించడం బాధాకరం. మా జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు? ప్రభుత్వం మా ఉద్యోగాలు వెంటనే క్రమబద్ధీకరించాలి.  
 
చట్టసవరణలు చేసైనా క్రమబద్ధీకరించాలి
వై.నేతాజీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు బేసిక్‌ వేతనాలను కూడా ఇవ్వడం లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు కానీ ఆ విషయాన్ని ఇంతవరకూ తేల్చలేదు. అవసరమైతే అసెంబ్లీలో చట్టసవరణలు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement