యూ..‘డై’స్‌ ! | officers fail of udies | Sakshi
Sakshi News home page

యూ..‘డై’స్‌ !

Jul 27 2017 10:04 PM | Updated on Nov 9 2018 4:19 PM

యూ..‘డై’స్‌ ! - Sakshi

యూ..‘డై’స్‌ !

జిల్లాలో విద్యార్థుల గణనపై అధికారులు మొద్దనిద్ర వీడలేదు. ఆరు మండలాల్లో సర్వే ఊసే లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.

- విద్యార్థి గణనపై అధికారుల మొద్దునిద్ర
- ఆరు మండలాల్లో ‘0’ సంఖ్య నమోదు
- ఆగస్టు 5తో ముగియనున్న గడువు


జిల్లాలో విద్యార్థుల గణనపై అధికారులు మొద్దనిద్ర వీడలేదు. ఆరు మండలాల్లో సర్వే ఊసే లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం (యూడైస్‌) జాబితాలో లేని విద్యార్థులను గుర్తించేందుకు చేపట్టిన ‘విద్యార్థి గణన’...  విద్యాశాఖ నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది.

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యారంగంలో పాలనాపరమైన పారదర్శకత కోసం యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం (యూడైస్‌)ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2012-13 విద్యాసంవత్సరంలో విద్యార్థుల గణనను పూర్రి చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే ఆధారంగా బడి ఈడు పిల్లల సంఖ్యకు యూడైస్‌లో నమోదైన పిల్లల సంఖ్యకు గణనీయమైన తేడాలు వచ్చాయి. ప్రజాసాధికారిక సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు 6.61 లక్షల మంది తేలారు. యూడైస్‌ సర్వే ప్రకారం వీరిలో బడిలో చదువుతున్న పిల్లలు 5.73 లక్షల మంది మాత్రమే ఉన్నారు. తక్కిన 88 వేలమంది విద్యార్థుల వివరాలు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ‘విద్యార్థి గణన’కు మరోసారి శ్రీకారం చుట్టింది.  

అంతులేని నిర్లక్ష్యం
ప్రజాసాధికారిక సర్వే ప్రకారం జిల్లాలో మొత్తం 6.61 లక్షల మంది 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలున్నారు. వీరిలో యూడైస్‌ లెక్కల్లో 5.73 లక్షల మంది ఉన్నారు. తక్కిన 88,134 మంది పిల్లల లెక్కలు తేల్చాల్సి ఉంది. ఇందుకోసం ఎన్యూమరేటర్ల (సీఆర్పీ, డీఎల్‌ఎంటీలు) ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయించాల్సిన బాధ్యత మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలపై ఉంది. ఆగస్టు 5తో గడువు ముగుస్తున్నా.. నేటికీ 13,673 మంది పిల్లల వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అమడగూరు, బ్రహ్మసముద్రం, గోరంట్ల, గుంతకల్లు, కొత్తచెరువు, ఓడీ చెరువు మండలాల్లో ఇప్పటిదాకా ఒక్క పిల్లాడి వివరాలు కూడా నమోదు కాలేదు. అలాగే మరో 19 మండలాల్లో కేవలం రోజూ 10 మందిలోపు పిల్లల వివరాలను నమోదు చేస్తున్నారు.

గడువులోగా పూర్తి చేయకపోతే చర్యలు
విద్యార్థి గణన సర్వే ఆగస్టు 5లోపు పూర్తి చేయాలి. సర్వే పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలదే. కార్యక్రమం పర్యవేక్షణకు సెక్టోరియల్, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ ఆఫీసర్లతో ప్రత్యేక బృందాలను నియమించాం.  గడువులోగా సర్వే పూర్తి చేయని మండలాల అధికారులపై చర్యలుంటాయి.
–  సుబ్రహ్మణ్యం, ఎస్‌ఎస్‌ఏ పీఓ

Advertisement
 
Advertisement
Advertisement