రాజధాని నిర్మాణం ముసుగులో భారీ కుంభకోణం

రాజధాని నిర్మాణం ముసుగులో భారీ కుంభకోణం - Sakshi

  • రూ.లక్ష కోట్లకు ఎసరు!

  • చట్టం వధ.. ధర్మం చెర

  • సింగపూర్‌తో ఒప్పందంలోనే అక్రమాలకు బీజం..

  • ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి టోకరా!

  • సుప్రీం కోర్టు మార్గదర్శకాలు తుంగలోకి

  • కేల్కర్ కమిటీ నివేదిక బుట్టదాఖలు

  • ఏపీఐడీఈఏ-2001 నిబంధనలు బేఖాతరు

  • ‘స్విస్ ఛాలెంజ్’ నిబంధనలూ ఉల్లంఘన

  • అధికారిక రహస్యాల ప్రమాణం గంగలోకి

  • 1,691 ఎకరాలు ‘సింగపూర్’కు కట్టబెట్టడమే ఏకైక లక్ష్యం

  •  ‘రియల్’ వ్యాపారంతో రూ.లక్ష కోట్లు దోచుకునే వ్యూహం

  •   హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో గుట్టురట్టు

  •   సాక్షి, హైదరాబాద్ : సుప్రీం కోర్టు మార్గదర్శకాలను బుట్టదాఖలు చేశారు.. ఏపీఐడీఏ-2001 చట్టాన్ని తుంగలో తొక్కారు. విజయ్ కేల్కర్ కమిటీ నివేదికను బేఖాతరు చేశారు... సింగపూర్ ప్రైవేటు సంస్థలతో కలిసి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టేందుకు ‘స్విస్ చాలెంజ్’ పేరుతో చంద్రబాబు సర్కారు భారీ కుంభకోణానికి తెరతీసింది. రాజధాని ఏర్పాటు ప్రకటన అధికారికంగా వెలువడకముందే వంది మాగధులకు లీకులు ఇచ్చి ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి నిరుపేద రైతుల కడుపుకొట్టి భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ కో... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహా దోపిడికి బరితెగించింది. భూసమీకరణ ముసుగులో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్టియంకు ధారాదత్తం చేసి.. రియల్ ఎస్టేట్ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్ ప్లాన్’ వేశారు.



    అందుకోసం స్విస్ చాలెంజ్ విధానం నిబంధనలనూ అడ్డగోలుగా ఉల్లంఘించి, ‘అధికారిక రహస్యాల ప్రమాణా’న్ని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేశారు. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత వీసమెత్తు కూడా లేదని సుప్రీం కోర్టు స్పష్టీకరించినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దంటూ కేల్కర్ కమిటీ తెగేసి చెప్పినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌లు వారించినా వెనక్కు తగ్గలేదు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేపట్టేందుకు స్విస్ చాలెంజ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేశారు. హైకోర్టు ధర్మాసనం సోమవారం చేసిన వ్యాఖ్యలు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలను తేటతెల్లం చేశాయి. చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం మధ్య కుదిరిన రహస్య ఒప్పందం గుట్టు రట్టయింది.



     ఒప్పందంలోనే దోపిడీకి మాస్టర్ ప్లాన్

     రాజధాని ముసుగులో చంద్రబాబు అండ్ కో భారీ దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారుచేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో నవంబర్ 12 నుంచి 14 వరకూ సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించారు. అప్పుడు కుదిరిన ఒప్పందం మేరకు రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ (ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) డిసెంబర్ 8, 2014న ఎంవోయూ కుదిరింది. ఆ మేరకు రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని డిసెంబర్ 5, 2014న కేంద్రానికి నివేదిక పంపారు. సింగపూర్ ప్రభుత్వం సూచించిన సంస్థలనే రాజధాని మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందనే అంశాన్ని దాచిపెట్టారు.



    ఈ ఒప్పందం కుదిరిన రెండు రోజులకే రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగినట్లు కేంద్రానికి నివేదిక పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఒప్పందం సమయంలోనే సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి టోకరా కొట్టినట్లు వెల్లడవుతోంది.


    మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందస్తుగా కుదిరిన ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు దోచుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.



     సిగ్గెందుకు.. లూటీ చేసేద్దాం...

    సింగపూర్ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కట్టబెట్టి.. బినామీలతో కలిసి దొరికినంత దోచుకోవడానికి సీఎం చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. కన్సార్టియంగా ఏర్పడిన సింగపూర్ సంస్థల్లో తన బినామీలు ఉండటంతో చంద్రబాబు రంగంలోకి దిగారు.


    ఈ ఏడాది జనవరి 24, 25న సింగపూర్ సంస్థలతో చర్చించిన చంద్రబాబు ఏడీపీలో ఆ సంస్థల వాటాను 58 శాతానికి పెంచాలని, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గించాలని స్వయంగా సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ వాటాను పెంచమని కోరాల్సిన చంద్రబాబు తగ్గించమనడాన్ని బట్టి చూస్తే బినామీలతో కలిసి అడ్డగోలుగా దోచుకోవడానికి ఏ స్థాయిలో బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా..? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది.



    ఇదిగాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే.. ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం... రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. ఇక్కడే సింగపూర్ కంపెనీల్లో బినామీల దోపిడీకి బీజం పడింది. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూమిలో 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేపట్టారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్‌లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది.


    అంటే.. 1691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి 20 ఏళ్లపాటూ ఎవరూ అడ్డు రాకుండా చూసేందుకు.. కేపిటల్ సిటీ పరిధిలో 20 ఏళ్లపాటూ రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి ఇవ్వకూడదంటూ ఏకంగా నిబంధన పెట్టేశారు.


    అంతే కాదు.. స్టార్టప్ ఏరియాలో భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం 4 లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి, మన డబ్బుతో మౌలిక సదుపాయాలు సమకూర్చి... సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా సింగపూర్ కంపెనీల కోసం, స్వప్రయోజనాలకోసం చంద్రబాబునాయుడు సర్కారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top