
ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్
సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.
♦ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం
♦ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్
♦ కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో
♦ రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం
పిడుగురాళ్ళ : సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని నాగబాలాజీ లేడీస్ కార్నర్ ఫిబ్రవరి 14న షార్ట్సర్య్కూట్తో కాలిపోయింది. దుకాణానికి బీమా ఉండడంతో ఫైర్ సర్టిఫికెట్ కోసం లేడీస్ కార్నర్ యజమాని జమ్మిగుంపుల నరేంద్ర పిడుగురాళ్ళ ఫైర్ ఆఫీసర్ కె. శివశంకర్రావును కలవగా రూ.30 వేలు డిమాండ్ చేశారు. నరేంద్ర రూ.20 వేలకు బేరం కుదుర్చుకుని బుధవారం గుంటూరులోని ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ శాంతోను సంప్రదించారు.
ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు గురువారం సాయంత్రం నరేంద్ర ఫైర్ ఆఫీసర్ను కలిసి రూ.20 వేలు ఇవ్వగానే, ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఫైర్ ఆఫీసర్ గదిలోకి ప్రవేశించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అగ్నిమాపక అధికారి శివశంకర్రావుపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ శాంతో తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నేరుగా తమను సంప్రదించాలని, వివరాలకు 94913 05638ను సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా ఫైర్ ఆఫీసర్ శివశంకర్రావు విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర అసలు దరఖాస్తు చేసుకోలేదని, దరఖాస్తు చేసుకోకుండా సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఈ నగదును కూడా తీసుకోలేదని, తన గదిలోకి ఆ నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు.