ఏలూరు (ఆర్ఆర్ పేట) : విద్యుత్ శాఖను అగ్రస్థానంలో నిలపడంలో భాగంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో విశేష సేవలందించిన సూపరెంటెండెంటింగ్ ఇంజినీర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి సేవా అవార్డు అందుకున్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణరెడ్డికి పురస్కారం
Aug 16 2016 2:08 AM | Updated on Oct 5 2018 6:30 PM
ఏలూరు (ఆర్ఆర్ పేట) : విద్యుత్ శాఖను అగ్రస్థానంలో నిలపడంలో భాగంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో విశేష సేవలందించిన సూపరెంటెండెంటింగ్ ఇంజినీర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి సేవా అవార్డు అందుకున్నారు. సోమవారం విశాఖపట్నంలోని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ చేతులమీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా జిల్లాలో నూరుశాతం విద్యుత్ సౌకర్యం కల్పించి దేశంలోనే జిల్లాను ప్రథమస్థానంలో నిలపడంలో సత్యనారాయణరెడ్డి విశేషకృషి చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రికార్డుస్థాయిలో 5 రోజుల్లో విద్యుత్ ఉపకేంద్రం నిర్మించి విద్యుత్ సరఫరా కల్పించడంలోనూ ఆయన పాత్ర విశేషమనే చెప్పాలి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 21 నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు నిర్మించి వాటిని ప్రారంభించడం, 27 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కెపాసిటీ పెంచడం, 12 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించారు. విద్యుత్ పొదుపులో భాగంగా జిల్లాలో 15.61 లక్షల ఎల్ఈడీ బల్బులు, 26,700 విద్యుత్ పొదుపు ఫ్యాన్లు పంపిణీ చేయించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపారు. సత్యనారాయణరెడ్డికి అవార్డుపై పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement


