బడి ఉన్నా.. బతికేదానివే! | Eighth grade student killed | Sakshi
Sakshi News home page

బడి ఉన్నా.. బతికేదానివే!

Jun 27 2016 8:43 AM | Updated on Jun 14 2018 4:21 PM

బడి ఉన్నా.. బతికేదానివే! - Sakshi

బడి ఉన్నా.. బతికేదానివే!

తాడిపత్రి రూరల్ మండలం భోగసముద్రం గ్రామానికి చెందిన రామాంజనమ్మ, వీరశేఖర్‌గౌడ్ దంపతుల పెద్దకుమార్తె తేజస్విని.....

ఆడుకుంటుండగా మెడకు చుట్టుకున్న తువ్వాలు
విషాదం మిగిల్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి
►  కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

 
ఆదివారం.. బడికి సెలవు. అమ్మానాన్నలతో పాటు చిట్టి చెల్లెళ్లను చూసేందుకు ఇంటికొచ్చింది ఆ చదువుల తల్లి. ఉదయమే నాన్న ఆటో నడిపేందుకు వెళ్లిపోగా, అమ్మ పూలమ్మేందుకు వెళ్లింది. ఇంటి పట్టునే ఇద్దరు చెల్లెళ్లతో కలసి ఆడుకుంటున్న  ఆ బాలిక ఆదే వారితో ఆఖరి ఆట అవుతుందని ఊహించి ఉండదు. పొరపాటున తువ్వాలు మెడకు చుట్టుకోవడంతో ఊపిరి ఆగిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.  - తాడిపత్రి రూరల్
 
 
తాడిపత్రి రూరల్ మండలం భోగసముద్రం గ్రామానికి చెందిన రామాంజనమ్మ, వీరశేఖర్‌గౌడ్ దంపతుల పెద్దకుమార్తె తేజస్విని(12) ప్రమాదవశాత్తు తువ్వాళు మెడకు చుట్టుకుని మరణించింది. పైన పేర్కొన్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, తేజస్విని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లి ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివేది. మిగిలిన ఇద్దరు పిల్లలు గీతాంజలి(9) స్వగ్రామంలోనే ఐదో తరగతి చదువుతుండగా, కావేశ్వరి(6) రెండో తరగతి చదువుతోంది.


పిల్లలను బాగా చదివించాలని..
వీరశేఖర్‌గౌడ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, రామాంజనమ్మ పూలు అమ్మి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. తాము పడే కష్టం పిల్లలకు వద్దనుకున్నారు. ఎన్ని ఇబ్బందులైనా వారిని బాగా చదివించాలని ఆశించారు. చదువులో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న పెద్ద కుమార్తెను చూసి వారు మురిసిపోయేవారు. పెద్ద పెద్ద చదువులు చదివి, మంచి స్థాయికి ఎదిగాక వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటారని భావించారు.


బతికించుకోవాలని...
అప్పటి వరకు తమతో ఆడుకున్న అక్క ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయింది. భయంతో మిగిలిన ఇద్దరు పిల్లలు పరుగున వెళ్లి అమ్మతో చెప్పారు.  వెంటనే ఆమె ఇంటికి చేరుకుని ఆగమేఘాల మీద బిడ్డను బతికించుకుందామని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బిడ్డ ఇక లేదని చెప్పడంతో ఆమె అక్కడికక్కడే స్పృహతప్పింది. కాసేపటికి తేరుకున్నాక విగతజీవిగా మారిన బిడ్డ గుండెలపై పడి ‘బిడ్డా.. ఎంత పనైందే తల్లీ. బడి ఉన్నా నువ్వు బతికేదానికి కదా? అంటూ రామాంజనమ్మ నోటి వెంట వచ్చిన ఒక్కో మాట అందరినీ కదిలించింది.


మృతదేహానికి పోస్టుమార్టం
సమాచారం తెలిసిన వెంటనే రూరల్ ఎస్‌ఐ నారాయణరెడ్డి తమ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement