జలం కోసం..జనంలోకి! | Sakshi
Sakshi News home page

జలం కోసం..జనంలోకి!

Published Mon, Mar 21 2016 2:50 AM

జలం కోసం..జనంలోకి!

దాహార్తితో అలమటిస్తున్న వన్యప్రాణులు
ఎండలు, వర్షాభావంతో అడవుల్లో కరువైన నీళ్లు, ఆహారం
ఆకలి, దాహంతో జనావాసాల్లోకి జంతువులు..
భయంతో.. కుక్కలబారిన పడి మృత్యువాత

 పాపన్నపేట:  కరువు కోరలకు జనంతో పాటు జంతువులూ విలవిల్లాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం వనం వీడి జనంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటీవల మయూరాలు పెద్దసంఖ్యలో జనావాసాల్లోకి వచ్చి మరణిస్తున్న ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే ప్రధాన నీటి వనరులన్నీ వట్టిపోవడంతో మొసళ్లు చా న్నాళ్లుగా తీరానికి చేరుతున్నాయి. తాజాగా పాపన్నపేటలో ఓ జింక పిల్ల జనావాసంలోకి వచ్చి కుక్కల బారిన పడి.. చివరకు భయంతో, గాయాలతో ప్రాణాలు వదిలిన ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

 అడవుల్లో ఆహారం, నీళ్లు కరువై..
పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన అడవులు చినుకు జాడ కరువై ఎండిపోతున్నాయి. దీంతో అటు మేత లేక, ఇటు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకక అటవి జంతువులు తప్పనిసరి పరిస్థితుల్లో జనారణ్యంలోకి అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం మండల కేంద్రమైన పాపన్నపేటలోకి వచ్చింది. వెంటపడ్డ ఊర కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంటి యజమాని జకీర్ స్పందించి వెంటనే దాన్ని పోలీస్‌స్టేషన్‌కు  తీసుకెళ్లాడు. అప్పటికే కాలికి రక్తమోడుతూ భయంతో గజగజ వణికిపోతున్న జింకను రక్షించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వెటర్నరి డాక్టర్ బెంజిమెన్ వచ్చి జింక ప్రాణాలు రక్షించేందుకు విఫలయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక ఆ మూగజీవి ప్రాణాలు వదిలింది.

మిలమిల మెరిసే కళ్లతో.. అమాయకపు చూపులతో వణికిపోతున్న జింక తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన సంఘటన పాపన్నపేట జనాలందరిని కంటతడి పెట్టించింది. అలాగే 15 రోజుల క్రితం ఘణపురం ఆనకట్టనుండి మొసలి ఒడ్డుకు చేరింది. ప్రాజెక్ట్‌లో నీళ్లు లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో మొసలి ఒడ్డుకు చేరింది. అది గమనించిన జాలర్లు వలలో పట్టి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

 అటవీ శాఖ చర్యలేవీ?
వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేసి దాహార్తి తీర్చే ప్రయత్నం చేయాలని, గడ్డి, ఇతరత్రా ఆహార సౌకర్యాలు కల్పించాలని వారంటున్నారు.

Advertisement
Advertisement