
మద్యం కూడా పంపిణీ చేస్తారేమో..!?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం రానున్న రోజుల్లో మందుబాబులకు రోజుకో మద్యం సీసా
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
మునుగోడు:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం రానున్న రోజుల్లో మందుబాబులకు రోజుకో మద్యం సీసా కూడా పంపిణీ చేస్తానని ప్రకటిస్తాడేమోనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తూ టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
కేవలం తన పార్టీ బలోపేతానికి, రానున్న రోజుల్లో ఓట్లు రాబట్టుకునేందుకే మాత్రమే హామీలను గుప్పిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ప్రతి నియోజకవర్గానికి 30 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో సీఎం, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. తమ పార్టీలో గ్రూపు తగాదాలు లేవని అందరం ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి తమ అధినేత్రి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామన్నారు.