MLC Komati Reddy Rajagoparreddy
-
మద్యం కూడా పంపిణీ చేస్తారేమో..!?
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం రానున్న రోజుల్లో మందుబాబులకు రోజుకో మద్యం సీసా కూడా పంపిణీ చేస్తానని ప్రకటిస్తాడేమోనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తూ టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేవలం తన పార్టీ బలోపేతానికి, రానున్న రోజుల్లో ఓట్లు రాబట్టుకునేందుకే మాత్రమే హామీలను గుప్పిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ప్రతి నియోజకవర్గానికి 30 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. తమ పార్టీలో గ్రూపు తగాదాలు లేవని అందరం ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి తమ అధినేత్రి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామన్నారు. -
నారాయణరెడ్డి చెంపలు వాయించిన కోమటిరెడ్డి
భువనగిరి–యాదాద్రి డీసీసీ సమీక్షలో భౌతిక దాడులు సాక్షి, హైదరాబాద్: భువనగిరి–యాదాద్రి డీసీసీ అధ్యక్షుని ఎన్నిక రసాభాసగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు దిగారు. నల్లగొండ జిల్లా నుంచి విడిపోయిన భువనగిరి–యాదాద్రికి డీసీసీ అధ్యక్షు ని ఎంపికపై ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి మధ్య మాటామాటా పెరిగి, భౌతిక దాడుల దాకా వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... యాదాద్రి డీసీసీ అధ్యక్షునిగా ఎవర్ని ఎంపిక చేస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడైన మాజీ ఎమ్మెల్యే బి.భిక్షమయ్యగౌడ్ ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. ఆయన్ను ఎంపిక చేయడమే మంచిదని నారాయణరెడ్డి చెప్పారు. దీనిపై అభిప్రాయం ఏమిటని రాజగోపాల్రెడ్డిని దిగ్విజయ్ అడిగారు. ‘నా అభిప్రాయానికి విలువిచ్చి.. నేను చెప్పిన వ్యక్తికే డీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇస్తామంటే పేరు చెప్తా. నా అభిప్రాయం ప్రకారమే ఎంపిక ఉండాలి’ అని బదులిచ్చారు. దీనిపై నారాయ ణరెడ్డి జోక్యం చేసుకుంటూ ‘రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించారు. వాటితో రాజకీయాలు చేస్తున్నారు. ఆయనను పట్టించుకోవాల్సిన పనిలేద’ని అన్నారు. దీనికి రాజగోపాల్రెడ్డి ఆగ్రహంగా ‘బ్రోకర్ పనిచేసి రాజకీయాలు చేస్తున్నది నారాయణ రెడ్డి. నయీంతో భూముల దందాలు చేసిన చరిత్ర నీది. నీతిగా కాంట్రాక్టులు చేస్తున్న నా గురించి మాట్లాడతావా’ అంటూ స్పందించా రు. మాటామాటా పెరిగి నారాయణరెడ్డిపై రాజగోపాల్రెడ్డి చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘటనతో దిగ్విజయ్, ఉత్తమ్తోపాటు నేతలంతా నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కొందరు నేతలకు స్వల్ప గాయాలైనట్టు తెలిసింది.