భానుడి ప్రతాపం: వడదెబ్బతో 71 గొర్రెల మృతి | 71 sheeps died of sunstroke | Sakshi
Sakshi News home page

భానుడి ప్రతాపం: వడదెబ్బతో 71 గొర్రెల మృతి

Apr 24 2016 8:48 PM | Updated on Mar 28 2018 11:26 AM

భానుడి ప్రతాపం: వడదెబ్బతో 71 గొర్రెల మృతి - Sakshi

భానుడి ప్రతాపం: వడదెబ్బతో 71 గొర్రెల మృతి

వడదెబ్బతో 71 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి): తీవ్రమైన ఎండలతో బీభత్సం సృష్టిస్తోన్న భానుడు మనుషులతోపాటు జంతువుల ప్రాణాలనూ హరించుకుపోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతుల సంఖ్య 100కు చేరువవుతున్న తరుణంలో వడదెబ్బకు గురై  71 మూగజీవాలు ఒకేసారి మృత్యువాత పడ్డాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, బురాన్, కిష్టయ్య ఏడాది క్రితం ఖానాపూర్‌కు వలస వచ్చారు. మొదట్లో కూలీపని చేసిన వీరు అప్పు చేసి గొర్రెలను కొనుగోలు చేసి వాటిని సాకుతున్నారు. ఆంజనేయులు వద్ద 300 జీవాలు, బురాన్‌వద్ద 400, కిష్టయ్య వద్ద 300 గొర్రెలున్నాయి. నిత్యం వీటిని మేత కోసం పొలాల్లో తిప్పుతున్నారు.

ఇటీవల తీవ్ర ఎండల ప్రభావానికి జీవాలు అస్వస్థతకు గురయ్యాయి. వీటికి సరిగా నీళ్లు కూడా దొరకడం లేదు. ఆదివారం ఉదయం మేత కోసం గొర్రెలను తోలుకెళ్లిన కాపరులు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జీవాలు ఒక్కొక్కటిగా పడిపోసాగాయి. దీంతో వాటిని నీడకు చేర్చారు. కొద్దిసేపట్లోనే ముగ్గురు కాపరులకు చెందిన 71 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రూ. 4 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కాపరులు వేడుకొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement