రైడింగ్‌ కోసం బైక్‌ల చోరీ | Young Man Arrest in Bike And Cell Phone Robbery Case | Sakshi
Sakshi News home page

రైడింగ్‌ కోసం బైక్‌ల చోరీ

Jan 29 2019 10:30 AM | Updated on Jan 29 2019 10:30 AM

Young Man Arrest in Bike And Cell Phone Robbery Case - Sakshi

హిమాయత్‌నగర్‌: బైక్‌పై తిరగడం అంటే అతడికి సరదా. ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొట్టేందుకు సొంతంగా బైక్‌ లేకపోవడంతో ఓ యువకుడు బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు. ఖర్చుల కోసం సెల్‌ఫోన్‌ల చోరీలను కూడా ఎంచుకున్నాడు. బైక్‌లు, సెల్‌ఫోన్‌లు చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కి పలు మార్లు జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోకుండా పాత పంథానే అనుసరిస్తూ తాజాగా నారాయణగూడ పోలీసులకు చిక్కాడు మౌలాలీకి చెందిన మహ్మద్‌ అబ్థుల్‌ అమన్‌(18). 

చిన్నప్పటి నుంచే...
10వ తరగతి వరకు చదువుకున్న అమన్‌ ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాగా తిరిగేందుకు బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నాడు. ప్రతిసారి స్నేహితులను అడగడం ఇష్టం లేని అమన్‌ బైక్‌ చోరీలకు పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా 8 బైక్‌లను దొంగలించిన అతను ఇప్పటి వరకు మూడుసార్లు జైలుకు వెళ్లివచ్చాడు. చక్కర్లు కొట్టేందుకు రోడ్డు పక్కన పార్క్‌ చేసి ఉన్న వాహనాల్లో నుంచి పెట్రోల్‌ సైతం దొంగిలించేవాడు. 

వాచ్‌మెన్‌ ఇళ్లల్లో ఫోన్ల చోరీ...
ఫ్రెండ్స్‌తో మాట్లాడేందుకు ఫోన్‌ల చోరీకి శ్రీకారం చుట్టాడు. అపార్ట్‌మెంట్‌లలో వాచ్‌మెన్‌ ఇళ్లను ఎంచుకునే ఇతను ఇంటి తలుపు వేయకుండా బయట నిద్రస్తున్న వారిని గుర్తించి సెల్‌ఫోన్లు నగదు ఎత్తుకెళ్లేవాడు.. ఇప్పటి వరకు 25 సెల్‌ఫోన్లు, రూ.లక్ష పైగా నగదును చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.  

రెండు గంటల్లో పట్టివేత...
సోమవారం తెల్లవారుజామున ఫరీద్‌బస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వాచ్‌మెన్‌ గోపాల్‌ ఇంట్లోకి చొరబడిన అతను ఖరీదైన సెల్‌ఫోన్, రూ.11వేలు కాజేసి పరర్యాడు. గోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్‌ ట్రాకింగ్‌ ద్వారా నిందితుడు ఎంఎస్‌.మక్తా బస్తీలో ఉన్నట్లు గుర్తించారు. కానిస్టేబుళ్లు శ్రీకాంత్, నర్సింహ్మా, వినోద్, బ్రహ్మయ్య అతడిని పట్టుకునేందుకు వెళ్లగా వీరిని చూసిన అమన్‌ తప్పించుకునేందుకు యత్నిస్తుండగా ఛేజ్‌ పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement