సిమెంట్‌ అక్రమ వ్యాపార కేంద్రంపై దాడులు | Police Attacks On Cement Illicit Business Center | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ అక్రమ వ్యాపార కేంద్రంపై దాడులు

Aug 14 2018 3:12 PM | Updated on Aug 29 2018 4:18 PM

Police Attacks On Cement Illicit Business Center - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటయ్య 

చౌటుప్పల్‌ (మునుగోడు) : అక్రమంగా సాగిస్తున్న సిమెంట్‌ వ్యాపార కేంద్రంపై రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దా డులు నిర్వహించారు. ట్యాంకర్ల నుంచి అక్రమ పద్ధతుల్లో సిమెంట్‌ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులతోపాటు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. సిమెంట్‌ ట్యాంకర్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. రూ.11,500 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఏరుకొండ వెంకటయ్య సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు.  

రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన నీల మల్లేశం లారీ డ్రైవర్‌గా, నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రా మానికి చెందిన రుద్రాక్షి నరహరి క్లీనర్‌గా  సిమెంట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ప్రాం తంలోని మైహోం ఇండస్ట్రీస్‌ నుంచి ఏపీ24 డ బ్ల్యూ 4073 నంబరు గల ట్యాంకర్‌ లారీలో సిమెంట్‌ను తీసుకుని హైదరాబాద్‌లోని ఆ కంపెనీకి చెందిన గోదాముకు వెళ్లారు.

అక్కడ లారీలోని సిమెంట్‌ను ఖాళీ చేసి తిరిగి కంపెనీకి బయలుదేరారు. ఈ క్రమంలో మండల కేంద్రం లోనే నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన దేశగోని సుధాకర్‌ ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. అప్పటికే తమకు అందిన సమాచారం ప్రకారం ఎస్‌ఓటీ పోలీసులు సమీపంలో మాటువేసి ఉన్నారు. ట్యాంకర్‌ నుంచి సిమెంటును బస్తాల్లోకి నింపుతున్న క్రమంలో పట్టుకున్నారు. 

350 సిమెంటు బస్తాల సిమెంట్‌ స్వాధీనం 

సుధాకర్‌కు చెందిన అక్రమ కొనుగోలు కేంద్రంలో దాడులు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు 350 సిమెంటు బస్తాలు లభ్యమయ్యాయి. సిమెంటును దిగుమతి చేస్తున్న లారీ సైతం పట్టుబడింది. లారీడ్రైవర్, క్లీనర్‌ల వద్ద రూ.11,750 నగదు, రెండు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. వీరిద్దరితో పాటు కొనుగోలుదారుడైన సుధాకర్‌ను అరెస్టు చేశారు. 

మరోసారి చిక్కితే పీడీయాక్ట్‌ 

సిమెంటు అక్రమ వ్యాపారం నిర్వహించే వ్యక్తులతో పాటు సిమెంటును విక్రయించే లారీ డ్రైవర్లు, క్లీనర్లపై నిఘా పెంచామని సీఐ తెలిపారు. ఒకసారి పట్టుబడిన వ్యక్తులు మరోసారి చిక్కితే పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్తున్న  సిమెంటు లారీ వలిగొండ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని గుర్తుచేశారు.

ఈ తతంగంలో సంబంధిత సిమెంటు గోదాముల వద్ద పనిచేసే వ్యక్తుల సహకారం సైతం ఉందని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను రిమాండ్‌ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించామని సీఐ వివరించారు. సమావేశంలో స్థానిక ఎస్‌ఐ ఎన్‌.నవీన్‌బాబు, ఎస్‌ఓటీ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement