లక్కీ డ్రా పేరుతో మోసం..!

Police Arrested Lucky Draw Cheating Gang In Adilabad - Sakshi

సాక్షి, బెల్లంపల్లి(అదిలాబాద్‌):  లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ కె.జగదీష్‌  వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం విట్టునాయక్‌ తండాకు చెందిన కొంతమంది యువకులు లక్కీ డ్రా పేరుతో బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను మోసం చేస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. ఇంటింటికి వెళ్లి జుపిటర్‌ మార్కెటింగ్, పాలీగోల్డ్‌ మార్కెటింగ్, రెడ్‌ ఫాక్స్‌ హోమ్‌ అప్లయన్సెస్, స్కాలర్‌ హోమ్‌ అప్లయన్సెస్, శ్రీసాయి ఓంకార్‌ ఎంటర్‌ ప్రైజేస్‌ కంపెనీ పేర్లతో స్క్రాచ్‌ కార్డులను చూపించి గ్రామీణులను లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. «గత నెల 20వ తేదీన ధర్మపురిలో ఎనిమిది మంది బృందం సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. స్క్రాచ్‌కార్డులు కొనుగోలు చేసిన తరువాత లక్కీ డ్రాలో బహుమతులు వస్తాయని నమ్మించి రూ.2వేల నుంచి రూ.7,500 వరకు దొరికినంత వసూళ్లు చేశారు. చెన్నూర్, రామగుండం, ధర్మారం తదితర ప్రాంతాల్లోనూ ఇలాగే  వసూళ్లకు పాల్పడ్డారు.

గత నెల 29న బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది మహిళలను లక్కీ డ్రా ఆశచూపి రూ.14వేలు వసూళ్లు చేశారు. ఆ సమాచారంతో తాళ్లగురిజాల పోలీసులు ఈ నెల 1న నిందితులపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్క్రాచ్‌ కార్డులపై ఉన్న ఫోన్‌ నంబర్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి బుధవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మూడు సంజీవ్, కేతవాత్‌ గోపాల్, కేతవాత్‌ అరవింద్‌ , జాదవ్‌ అకాశ్, కేతవాత్‌ అలియాస్‌ రాథోడ్‌ రాజు, పవర్‌కేషు, కేతవాత్‌ గోపాల్,  చవాన్‌కుమార్‌ ఉన్నట్లు వివరించారు. అనంతరం నిందితుల వద్దనుంచి రూ.29,090 నగదు, 2కార్లు,  గృహోపకరణ వస్తువులైన కుక్కర్లు, మొబైల్‌ ఫోన్లు 8,  వివిధ కంపెనీలకు చెందిన స్క్రాచ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.  ఈ సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.సమ్మయ్య, పోలీసు సిబ్బంది  పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top