ఎంతపని చేశావు తల్లి !
మూడేళ్ల కుమార్తెతో రైలు కిందపడి తల్లి ఆత్మహత్య
కుటుంబ కలహాలే కారణం
ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
సరుబుజ్జిలిలో విషాదం
ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదుగాని చావే శరణ్యమనుకుంది. ఈ లోకం నుంచి దూరంగా వెళ్లిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. నవ మాసాలుమోసి.. కనిపెంచిన మూడేళ్ల కుమార్తెతో సహా వేగంగా వస్తున్న రైలుకి ఎదురెళ్లి.. దానికిందపడిపోయింది... క్షణాల్లో తల్లీపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జంక్షన్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్కు సమీపంలో తాండ్రాసి మెట్టవద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. సరుబుజ్జిలి మండల కేంద్రానికి చెందిన పేకాన ఇందుమతి (30), ఆమె కుమార్తె ధనలక్ష్మి (03) చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆమదాలవలస/సరుబుజ్జిలి: సరుబుజ్జిలి మండల కేంద్రానికి చెందిన పేకాన లక్ష్మణరావుకు 2011లో పాలకొండ మండలం బొడ్డవలసకు చెందిన ఇందుమతి (30)తో వివాహమైంది. వీరికి 5 సంవత్సరాల బాబు రాజు, కుమార్తె ధన లక్ష్మి(3) ఉన్నారు. లక్ష్మణరావు పుట్టుకతోనే మూగవాడు. అయినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలపెట్టేవాడుకాదు. మండల కేంద్రానికి సమీపంలో బార్బర్ షాపు నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చెవాడు. అయితే ఇటీవల ఈ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైనట్టు స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం కూడా లక్ష్మణరావు, ఇందుమతి దంపతుల మధ్య గొడవ జరిగింది.
దీంతో మనస్తాపానికి గురైన ఇందుమతి తన మూడేళ్ల కూతురు ధనలకిŠష్మ్ని తీసుకొని ఆమదాలవలస వచ్చేసింది. నిత్యం జరిగే గొడవలతో ఈ జీవితం ఎందుకు అనుకుందో ఏంగాని చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. నవమాసాలు మోసి.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం జంక్షన్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్కు సమీపంలో తాండ్రాసి మెట్టవద్ద భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ కింద పాపతోసహా పడిపోయి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే హెచ్సీ చిరంజీవిరావు సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కుమారుడి ప్రాణం దక్కింది
గురువారం ఉదయం ధనలక్ష్మి, భర్త లక్ష్మణరావు మధ్య గొడవ జరిగింది. తరువాత లక్ష్మణరావు మంగళవాయిద్యాలు వృత్తిపై వేరక ప్రాంతానికి వెళ్లిపోయాడు. బాబు రాజును స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలకు పంపించేశారు. అయితే మనస్తాపంతో ఉన్న ధనలక్ష్మి తన వద్ద ఉన్న పాప ధనలక్ష్మిని తీసుకొని బాబు చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్లింది. బాబును వెంటపంపించమని స్కూల్ సిబ్బందిని అడిగినప్పటికీ వారు పంపించలేదు. దీంతో కూతురుని తీసుకొని వెళ్లి ఇందుమతి రైలుకింద పడి చనిపోయింది. పాఠశాల సిబ్బంది బాబును కూడా పంపించి ఉంటే బతికి ఉండేవాడుకాదని స్థానికులు చెబుతున్నారు. కాగా రాజు కూడా తండ్రిలాగే పుట్టుకుతోనే మూగవాడు.