వివాహేతర సంబంధం మోజులో కిరాతకం
మూడేళ్ల చిన్నారిని హతమార్చిన తల్లి, ప్రియుడు
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా పెరుందురై అయ్యప్పన్ నగర్కు చెందిన కార్తికేయన్. అతని భార్య భువనేశ్వరి. వీరి మూడో కుమారుడు కిషోర్ (3). భువనేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన సోమసుందరంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న కార్తికేయన్ భార్యను మందలించాడు. దీంతో భువనేశ్వరి భర్త నుంచి విడిపోయి తన కుమారుడు కిషోర్తో సహా ఇంటి నుంచి పారిపోయి అంబత్తూరు మేనంమేడు వువుసి నగర్లోని ఓ అద్దె ఇంట్లో సోమసుందరంతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం చిన్నారి కిషోర్ మిద్దెపై నుంచి కింద పడి మృతి చెందాడని పెరుంతురైలో ఉన్న తన అత్త భువనేశ్వరికి సమాచారం తెలిపింది.
మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి పట్టుకోటైలో ఉన్న భువనేశ్వరి అక్క ఇంటికి తీసుకొచ్చారు. ఆమె అక్కకు చిన్నారి మృతిపై సందేహం కలగడంతో పట్టుకోటై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేయగా చిన్నారి కిషోర్ హత్యకు గురైనట్టు తెలిసింది. దీని గురించి అంబత్తూరు సహాయ కమిషనర్ కన్నన్కు పట్టుకోట్టై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పట్టుకోట్టై వెళ్లి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తెలిసింది. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
సంబంధిత వార్తలు