నా భార్యే కారణం: మనోహరచారి

Manohara Chary Blames His Wife - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూతురు, అల్లుడిపై పాశవికంగా దాడి చేసిన మనోహరచారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. తన​కు చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న అక్కసుతోనే దాడికి పాల్పడినట్టు చెప్పాడు. మనోహరచారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు గురువారం అతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. దాడి ఎందుకు చేశావన్న ప్రశ్నకు మనోహరచారి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తన కూతురు మాధవిని చంపాలనుకున్నానని ఒకసారి, భయపెట్టాలనుకున్నానని మరోసారి చెప్పాడు. అసలు దీనంతటికి కారణం తన భార్య అని, ఆమెను చంపితే సరిపోయేదన్నాడు. అల్లుడు సందీప్‌ మంచోడేనని కితాబిచ్చాడు.

‘నాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకున్న నా బిడ్డను చంపాలనుకున్నా. ఒకమాట చెబితే నేనే పెళ్లి చేసేవాణ్ని. చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చూసుకున్నా. నాకు వచ్చిన డబ్బులన్నీ ఆమెకు ఇచ్చేవాణ్ని. కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటే నన్నే మోసం చేసి వెళ్లిపోయింది. బట్టలు కొనడానికి రమ్మని చెప్పలేదు. బయటకు రమ్మని చెప్పానంతే. భయపెట్టిద్దామనుకున్నా. మద్యం మత్తులో ఉండటం వల్ల దాడి చేశాను. ఆమె బతకాలి. తొందరపడి తప్పుచేశా. మాధవి ప్రేమ విషయం నా భార్యకు తెలుసు. ఆమె నాకు ఒక మాట చెప్పాలి కదా? సందీప్‌ కొంచెం మంచోడే. అంకుల్‌ అని నన్ను పిలిచేవాడ’ని మనోహరచారి పేర్కొన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top