హత్యా... ఆత్మహత్యా!

Man Suspected Death In Narasannapeta - Sakshi

సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : మండలంలోని పోతయ్యవలసకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన సాగునీటి కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం ఉదయం నరసన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ మృతదేహం అక్కడకు ఎలా వచ్చిందనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. కాలువలో ఎక్కువగా నీరు లేదు. పైగా దూరం నుంచి కొట్టుకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ ప్రాంతంలో పిచ్చిమొక్కలు అధికంగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ బయట హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. శరీరంపైన గాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించడానికి వీలు కాలేదు. పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా ఉంది.

మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం పొలానికి వెళ్తున్న కొంతమంది రైతులు ఇక్కడ కాలువలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎస్‌ఐ వీ సత్యనారాయణ, ఏఎస్‌ఐ నాగభూషనరావు వెళ్లి పరిశీలించారు. శరీరంపై లుంగీ, చుక్కల షర్ట్‌ ఉన్నాయి. వేలికి గోలిరంగు ఉంది. దుస్తుల్లో వెతికినా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. శ్రీకాకుళం రిమ్స్‌ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే నరసన్నపేట పోలీసులకు సంప్రదించాలన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top