ప్రేమించి పెళ్లాడినవాడే కాలయముడు!

Husband Killed pregnant Wife In Krishna - Sakshi

గర్భిణి భార్యను చంపింది తనేనని ఒప్పుకున్న భర్త

కృష్ణాజిల్లా, గన్నవరం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతని వివాహేతర సంబంధం విషయమై గట్టిగా ప్రశ్నించినందుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి హతమార్చా డు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు గ్యాస్‌ ట్రబు ల్‌తో భార్య చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇది స్థానిక ఉపాధ్యాయనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఈడే రాణి (24) మర్డర్‌ మిస్టరీ. తనకన్నా రెండేళ్ళు పెద్దదైన రాణిని ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న భర్త ఈడే వెంకటరాంప్రసాద్‌ అత్యంత కర్కశంగా హత్య చేసిన విషయం సంచలం సృష్టించింది. నాలుగేళ్ల క్రితం వివాహం జరిగినప్పటికి వీరి మధ్య తరచూ మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఏడాదికి పెద్ద మనుషుల పంచాయితీతో విడిపోయారు.

అయితే రెండు నెలలు తర్వాత తిరిగి కలుసుకుని కాపురం చేసుకుంటున్నప్పటికి రాంప్రసాద్‌ వివాహేతర సంబం ధం విషయమై వీరి మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది నెలలు నిండిన గర్భిణి అయిన ఆమెకు ఈ నెల 10వ తేదీ డెలివరీ డేట్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన భర్తను రాణి గట్టిగా నిలదీయడంతో వీరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన రాంప్రసాద్‌ నిండు గర్భిణీని గోడ వైపునకు నెట్టి చేతి వేలిముద్రలు పడకుండా నైటీతో ఆమె గొంతును నులిమి చంపేశాడు. అనంతరం తెలివిగా భార్య గ్యాస్‌ ట్రబుల్‌తో చనిపోయిందని ఆమె బంధువులకు కబురు చేయడంతో పాటు అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి చేసిన హత్యను స్వయంగా రాంప్రసాదే అంగీకరించడంతో పోలీసులు అతనిపై మర్డర్‌ కేసు నమోదు చేశారు. మృతురాలికి ఆదివారం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఆమె కడుపులో మృతి చెందిన తొమ్మిది నెలల ఆడ శిశువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో రాణితో పాటు మరో ఐదు రోజుల్లో భూమి మీదకు రానున్న శిశువు కూడా అసువులు బాయడం అందరిని కలచివేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top