మహిళ హ్యాండ్బ్యాగ్లో నగలు, నగదు చోరీ
తమిళనాడు, తిరుత్తణి: తిరుత్తణి సుబ్రమణ్యస్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచిఉన్న మహిళా భక్తురాలి హ్యాండ్ బ్యాగులో రూ.మూడు లక్షల విలువైన ప్లాటినం నగలతో పాటు రూ.60 వేలు నగదు చోరీకి గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరా బాదుకు చెందిన గీతారెడ్డి (38), ఆమె భర్త రాములురెడ్డితో పాటు కుటుంబసభ్యులు మొత్తం 15 మంది ఆదివారం సాయంత్రం తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం చేరుకున్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో సర్వదర్శన క్యూ ద్వారా స్వామిని దర్శించుకునేందుకు వెళుతుండగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు చేతివాటం ప్రదర్శించి గీతారెడ్డి హ్యండ్ బ్యాగులో ఉంచిన రూ.మూడు లక్షలు విలువైనం ప్లాటినం నగలతో పాటు రూ. 60వేలు నగదు సైతం చోరీ చేశారు.
కొంతసేపటి తరువాత హ్యండ్బ్యాగు తెరిచి ఉండడంతో ఆందోళన చెందిన మహిళ బ్యాగులో చూడగా నగలు, నగదు లేకపోవడంతో చోరీకి గురైనట్టు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. దీనిపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు కొండ ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా భక్తుల్లో కలిసిపోయి వచ్చిన మహిళ బ్యాగు నుంచి నగలు, నగదు అపహరించి పక్కనే ఉన్న మరో ఇద్దరు పురుషులకు ఇవ్వడం గుర్తించారు. దుండగులను త్వరలోనే పట్టుకుని బాధితురాలి నగలు, నగదు తిరిగి అందజేస్తామని పోలీసులు తెలిపారు.