స్నాప్ డీల్ పేరుతో ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్ | Cyberabad Police Held Fake E Commerce Website Gang In Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌తో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

Jan 3 2020 2:33 PM | Updated on Jan 3 2020 3:54 PM

Cyberabad Police Held Fake E Commerce Website Gang In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ-కామర్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ క్రైం పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన 4 నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లోని కబీర్‌పూర్‌కు చెందిన ముఠాలోని నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన సందీప్‌ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ.  5 కోట్ల వరకు మోసాలు చేసినట్లు నిందితుల విచారణలో తెలిందన్నారు. వారి నుంచి 12 సెల్‌ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, 1 స్కానర్‌​ ప్రింటర్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అయితే ‘స్నాప్‌డీల్లో ఓ మహిళ పొటాటో కటర్ను కొనుగోలు చేసింది. ఆ తరువాత  మీరు మొదటి బహుమతి పొందారు అంటూ ఆమెకు ఫోన్‌ చేశారు. సదరు మహిళకు రూ. 6 లక్షల 90వేలు విలువ చేసే కారును గెలుచుకున్నట్లు నమ్మించి రిజిస్ట్రేషన్‌ పేరుతో ఆమె నుంచి రూ. 2 లక్షల 30 వేల నగదు ఈ ముఠా వసూలు చేశారు’ అని ఆయన మీడియా ముందు వివరించారు. ఈ ముఠా స్నాప్ డీల్ పేరుతో ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, ఈ కామర్స్ లో సేకరించిన డేటా ఆధారంగా  వినియోగదారులకు గాలం వేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో బహుమతుల పేరుతో ఇలా చాలా మందిని మోసాలు చేస్తూ వస్తున్నారని అన్నారు. స్నాప్ డీల్,  క్లబ్ ఫ్యాక్టరీ, అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల యొక్క నకిలీ వెబ్ సైట్లు సృష్టించారని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ నుంచి ఫోన్‌ వస్తే ఒకటికీ రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బహుమతులు గెలుచుకున్నారని మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మోద్దని ఆయన హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement