డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు..

Attempt To Murder On Hotel Oner In East Godavari - Sakshi

హోటల్‌ యాజమానిపై ఓ వ్యక్తి బ్లేడుతో దాడి

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: అమలాపురం చిన్న వంతెన వద్ద గల ఆమని హోటల్‌ యాజమాని నల్లా సాయిబాబుపై ఓ వ్యక్తి రౌడీయిజం చేయడమే కాకుండా, హత్యాయత్నం చేశాడు. అమలాపురం ఉప్పరకాలనీకి చెందిన కోసూరి ప్రసాద్‌ అనే వ్యక్తి రోజూ ఆ హోటల్‌కు వచ్చి టిఫిన్లు తిని డబ్బులు ఇవ్వకుండా ఘరానాగా వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ప్రసాద్‌ హోటల్‌కు వచ్చి టిఫిన్‌ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నప్పుడు హోటల్‌ యాజమాని సాయిబాబు డబ్బులు ఇవ్వమని అడిగారు. నేను లోకల్‌...నన్నే డబ్బులు అడుగుతావా? అంటూ రౌడీయిజం చేశాడు. అక్కడే ఉన్న స్థానిక మార్కెట్‌కు చెందిన అమలదాసు గోవిందు అతడిని వారించాడు.

అయినా ప్రసాద్‌ హోటల్‌ యాజమానిని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి బ్లేడ్‌ తీసి సాయిబాబు పీక కోసేందుకు ప్రయత్నించాడు. సాయిబాబు త్రుటిలో తప్పించుకున్నా అతని ఎడమ బుగ్గ, పెదవి చీరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అలాతప్పించుకున్న సాయిబాబుపై బ్లేడ్‌తో దాడి చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తుండడంతో స్థానికులు అతడిని అదుపు చేశా రు. తీవ్ర రక్తస్రావం అదుతున్న సాయిబాబును తక్షణమే అత్యవర వైద్యం కోసం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడైన హోటల్‌ యాజమాని సాయిబాబు ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. కత్తులతోనే కాదు బ్లేడ్‌తో దాడి చేసినా రౌడీయిజం, హత్యాయత్నానికి పాల్పడినట్టేనని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు అన్నారు. ఎస్సై పి.విజయశంకర్‌ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top