పీఎన్‌బీ స్కాంపై మౌనం వీడిన ఆర్‌బీఐ గవర్నర్‌ | Urjit Patel Breaks His Silence On PNB | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాంపై మౌనం వీడిన ఆర్‌బీఐ గవర్నర్‌

Mar 14 2018 7:24 PM | Updated on Mar 14 2018 7:32 PM

Urjit Patel Breaks His Silence On PNB - Sakshi

గాంధీనగర్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వెలుగు చూసిన భారీ కుంభకోణంపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మౌనం వీడారు. ఏ బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ కూడా అన్ని మోసాలను గుర్తించలేదని, నిరోధించలేదని అన్నారు. గాంధీనగర్‌లో గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీలో పటేల్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎన్‌బీలో చోటు చేసుకున్న భారీ స్కాంపై రెగ్యులేటరీ పాత్రపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకున్న మోసాలు, అక్రమాలపై ఆర్‌బీఐ కూడా చాలా కోపంగా, బాధంగా ఉందని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కేసులను ఆర్‌బీఐ అసలు ఉపేక్షించదన్నారు. 

ప్రస్తుతమున్న న్యాయ అధికారాలతో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఏ బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ కూడా వీటిని ఆపలేదన్నారు. ప్రస్తుతం డ్యూయల్‌ రెగ్యులేషన్‌ సిస్టమ్‌ ఉందని, ఒకటి ఆర్థికమంత్రిత్వ శాఖ, రెండు ఆర్‌బీఐ అని, దీంతో నియంత్రణలో బీటలు వారి, ఈ భారీ కుంభకోణం సంభవించిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వహించడంలో ఆర్‌బీఐ రెగ్యులేటరీకి చాలా పరిమిత స్థాయిలో అథారిటీ ఉందని తెలిపారు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌లో సంబంధిత చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డైరెక్టర్లను, మేనేజ్‌మెంట్‌ను తొలగించే అధికారం ఆర్‌బీఐకి లేదన్నారు. అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ రెగ్యులేట్‌ చేసినప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎక్కువగా ప్రభుత్వం రెగ్యులేట్‌ చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ అధికారాలు ఆర్‌బీఐకి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రూ.12,700 కోట్ల పీఎన్‌బీ స్కాం విషయంలో ఆర్‌బీఐ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement