
ఐదేళ్లలో తెలంగాణలో ఎం-గవర్నెన్స్!
తెలంగాణలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కు (ఈ-గవర్నెన్స్) స్వస్తి పలికి...
ఈ-సేవ కేంద్రాల్లోని సేవలన్నీ మొబైల్స్కు మళ్లింపు
దీంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వ సేవల వినియోగం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కు (ఈ-గవర్నెన్స్) స్వస్తి పలికి.. దాని స్థానంలో మొబైల్ గవర్నెన్స్ను (ఎం-గవర్నెన్స్) తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ఐదేళ్లలో ఈ-సేవా కేంద్రాల్లోని 316 సేవలను మొబైల్స్కు మళ్లిస్తామన్నారు. దీంతో ప్రభుత్వ సేవలను ఎవరికి వారే తమ స్మార్ట్ఫోన్ల ద్వారా తామే చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఎం-గవర్నెన్స్కు అవసరమైన టెక్నాలజీని, యాప్లను రూపొందించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయన్నారు. టై, ఫిక్కీల సంయుక్త ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సొల్యూషన్స్ అండ్ స్మార్ట్ సొసైటీస్’ అనే అంశంపై సోమవారమిక్కడ సదస్సు, శిక్షణ శిబిరం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్మార్ట్ అనేది ప్రభుత్వ పాలనకే పరిమితం కాకూడదని, ట్రాఫిక్ నిబంధనలు, మున్సిపాలిటీ నిర్వ హణ వంటి మౌలిక వసతులన్నీ స్మార్ట్గా మారాలని అన్నారు.
స్మార్ట్ టెక్నాలజీ సదస్సు...
జులైలో అంతర్జాతీయ స్మార్ట్ టెక్నాలజీ సదస్సును నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అనంతరం ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. దేశంలో స్మార్ట్ టెక్నాలజీపై రోజుకు 3,000 పేటెంట్లు బయటికొస్తున్నాయని.. ఇందులో హైదరాబాద్ టెక్నాలజీ డెవలపర్లు, స్టార్టప్స్ తక్కువేం కాదని కొనియాడారు. స్మార్ట్ సిటీ అనేది సింగపూర్, బార్సిలోనా వంటి దేశాలకే పరిమితం కాకుండా ఆ జాబితాలో తెలంగాణనూ చేర్చుతామని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో 60 వేల చ.అ. విస్తీర్ణంలో, 8 వేల సీటింగ్ కెపాసిటీ తో ఉన్న ఇంక్యుబేటర్ సెంటర్ను త్వరలోనే లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం స్మార్ట్ హెల్త్, మొబిలిటీ, ఎనర్జీ అనే అంశంపై ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ (టై) ప్రెసిడెంట్ సఫిర్ అదేని తదితరులు పాల్గొన్నారు.