
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్పై సుప్రీంకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువును మార్చి 31, 2018 వరకు పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అన్ని సేవలకు ఆధార్నంబర్ అనుసంధాన గడువును మార్చి 31వ తేదీకి పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ చట్టం చట్టబద్ధత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది.
ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల బెంచ్ శుక్రవారం ఈ విషయంపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ల ఆధార్ లింకింగ్ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఉపశమనం కల్పించింది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా ప్రస్తుతానికి ఆధార్ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్ నంబర్ లేకుండానే బ్యాంకు ఖాతాను తెరవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆధార్ కార్డుకోసం దరఖాస్తు చేసిన కాపీని జతచేయాలని తెలిపింది. దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్న మొబైల్ ఆధార్లింకింగ్ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది.