రూపాయి విలువ 71 ఉంటే బెటర్
ఆర్థిక వేత్త కౌశిక్ బసు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 71 వద్ద ఉండడమే భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదని మాజీ చీఫ్ ఎకనమిక్ ఎడ్వైజర్ కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ఇది మంచి పరిణామం అవుతుందని అన్నారు. అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 7 శాతం పతనమై ఇటీవల 69 కిందకు జారి, కొంత కోలుకుని ప్రస్తుతం 69–68.50 స్థాయిలో తిరుగుతోంది.
అంతర్జాతీయ కోణంలో ప్రస్తుతం భారత్ కరెంట్ అకౌంట్లోటు, ద్రవ్యలోటు అంశాలపై దృష్టి పెట్టాలని, ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలని బసు సూచించారు. భారత్ ఆర్థికవ్యవస్థ స్థిరంగానే ఉందని ఆయన ఈసందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా సమసిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా భారత అవినీతి నిరోధక చట్టంలో ఇటీవల జరిగిన సవరణలు ఈ సమస్య పరిష్కారంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడవని న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక సమావేశంలో బసు పేర్కొన్నారు.