
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.272 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 378 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది.
గత క్యూ1లో రూ.4,444 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,641 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అనుబంధ కంపెనీలు–రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ల ఫలితాలను దీంట్లో కలపలేదని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ స్వల్పంగా లాభపడి రూ.440 వద్ద ముగిశాయి.