రిలయన్స్‌ ఏఎంసీ కొనుగోళ్ల నిధి

Reliance AMC Purchases Fund

సంస్థల కొనుగోళ్లకు రూ. 165 కోట్లు కేటాయించనున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల కొనుగోలు కోసం రూ. 165 కోట్ల మేర నిధులను కేటాయించనున్నట్లు రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) డిప్యూటీ సీఈవో హిమాంశు వ్యాపక్‌ తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మొత్తం 54 సంస్థలు ఉండగా.. వీటిలో దాదాపు సగం నష్టాలే నమోదు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.

ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నిధుల్లో రూ. 165 కోట్లను వేరే ఫండ్‌ సంస్థల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు వ్యాపక్‌ చెప్పారు. అక్టోబర్‌ 25–27 మధ్యలో ఐపీవోకి రానున్న రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ రూ. 1,542 కోట్లు దాకా సమీకరించనుంది. షేరు ధర శ్రేణిని రూ. 247–252గా నిర్ణయించింది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో లిస్టింగ్‌కి వస్తున్న కంపెనీల్లో ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ ఐపీవోలో రిలయన్స్‌ క్యాపిటల్, నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చెరి మూడు శాతం వాటాలు (సుమారు 3.67 కోట్ల షేర్లు) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనుండగా, కొత్తగా మరో 2.45 కోట్ల షేర్లను సంస్థ జారీ చేయనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top