
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్కి చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ వార్షిక టాలెంట్ ర్యాంకింగ్లో ఈసారి భారత్ రెండు స్థానాలు దిగజారి 53వ స్థానానికి పరిమితమైంది. అయిదోసారీ స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. 63 దేశాలతో ఐఎండీ బిజినెస్ స్కూల్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో టాప్–5 స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
గ్లోబల్ లిస్టులో మాత్రం సింగపూర్కు 13వ స్థానం దక్కింది. విద్యపై పెట్టే పెట్టుబడులు ఇతర సంపన్న దేశాల సగటుతో పోల్చినా తక్కువగా ఉండటం, నిపుణులైన విదేశీయులను ఆకర్షించడంలో సమస్యలు ఎదుర్కొంటుండటం తదితర అంశాల కారణంగా చైనా ర్యాంకింగ్ 39కి పరిమితమైంది. భారత్ విషయానికొస్తే.. టాలెంట్ పూల్లో సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులో మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్ పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ, సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు.