ఇన్వెస్ట్‌మెంట్‌.. మనోళ్లకు మహా ఇష్టం! | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌మెంట్‌.. మనోళ్లకు మహా ఇష్టం!

Published Tue, Oct 30 2018 12:40 AM

India tops as Asia's most investment savvy economy - Sakshi

ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్‌ చార్టర్డ్‌’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్‌ అఫ్లూయంట్‌ స్డడీ 2018’ పేరుతో ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతాల్లో సంపన్న వినియోగదారులు 11,000 మంది అభిప్రాయాలను సేకరించింది. పొదుపు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు తగినంత ఆదాయం కలిగి సంపన్న వినియోగదారులుగా అవతరిస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మనదేశంలో ఎక్కువ మంది సంపన్న కస్టమర్లు నమ్మే విషయం... సంపద నిర్వహణ సమర్థంగా నిర్వహించడం అన్నది గొప్ప సామాజిక చైతన్యానికి ప్రతీక అని.

అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ...
మన దేశంలో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను అనుసరిస్తున్నారు. ఈ సర్వేలో ఇదే గరిష్ట స్కోరు.  
 31 శాతం మంది మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటుంటే, 25 శాతం మంది ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలను, 22 శాతం ఈక్విటీలను ఎంచుకుంటున్నారు. కానీ, భారత్‌ వెలుపల సర్వే జరిగిన ఇతర మార్కెట్లలో ఈ సాధనాలను ఎంచుకునే వారు 16 శాతం, 19 శాతం, 18 శాతంగానే ఉన్నారు.  
 44 శాతం మంది కెరీర్‌లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు. మరో 25 శాతం మంది అయితే వ్యాపారం ఆరంభించాలని, సంపద వృద్ధికి ఇదే చక్కని మార్గమని భావిస్తున్నారు.  
 ఇక మనదేశంలో సంపన్న వినియోగ వర్గంగా అవతరించే వారిలో 79 శాతం మంది సమర్థవంతమైన సంపద నిర్వహణ సామాజిక చైతన్యానికి కీలకమని భావిస్తుండడం గమనార్హం.  
 అధిక సామాజిక చైతన్యం కలిగిన మార్కెట్‌గా భారత్‌ నిలిచింది. చైనా, భారత్‌ దేశాల్లో మూడింట రెండొంతులు (67%) మంది సామాజిక చైతన్యం పెరుగుదలను అనుభవిస్తున్నారు.  
 తమ పిల్లల చదువుల కోసం పొదపు చేయడం వీరి కీలక లక్ష్యంగా ఉంది. మన దేశంలో 17 శాతం మంది దీన్నే తెలియజేశారు. అంతేకాదు ఇతర మార్కెట్లలోనూ ఇదే అగ్ర ప్రాధాన్యమని 16 శాతం మేర చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం.  
 మన దేశంలో ఎక్కువ మందికి ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ... తక్కువ ఆర్థిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న అన్ని సాధనాల గురించి తెలియకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్టు స్టాండర్డ్‌ చార్డర్ట్‌ బ్యాంకు, రిటైల్‌ బ్యాంకింగ్‌ భారత విభాగం హెడ్‌ శ్యామల్‌ సక్సేనా తెలిపారు. డిజిటల్‌ ఉపకరణాలు వారి లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని చెప్పారు.  

సామాజిక చైనత్యం
మన దేశంలో సామాజిక చైనత్యం ఫరిడవిల్లుతోంది. ఆదాయాల్లో చక్కని వృద్ధి ఇందుకు తోడ్పడుతోంది. 46% మందికి గత ఏడాదిలో 10% వేతనం పెరగ్గా, 30 శాతం మందికి గత ఐదేళ్ల కాలంలో 50 శాతం అంతకంటే ఎక్కువే వేతనం వృద్ధి చెందింది. 78% మంది డిజిటల్‌ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. వారి విజయానికి ఇవే కీలకమని భావిస్తున్నారు. 80 శాతం మంది ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు ఓటేయగా, డిజిటల్‌ నగదు నిర్వహణ అన్నది ఆర్థిక లక్ష్యాల సాధనకు తమను దగ్గర చేశాయని తెలిపారు.

Advertisement
Advertisement