వ్యక్తిగత దివాలా నిబంధనలపై దృష్టి
దశలవారీగా అమల్లోకి తీసుకొస్తాం...
ఐబీబీఐ చైర్పర్సన్ ఎంఎస్ సాహూ
న్యూఢిల్లీ: వ్యక్తిగత దివాలా నిబంధనలను కూడా దశలవారీగా అమల్లోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇన్సాల్వెన్సీ బోర్డు (ఐబీబీఐ) చైర్పర్సన్ ఎంఎస్ సాహూ వెల్లడించారు. సుమారు ఏడాది క్రితం ప్రవేశపెట్టిన దివాలా చట్టం (ఐబీసీ) కింద ఇప్పటిదాకా 500 కార్పొరేట్ సంస్థలు పరిష్కార మార్గాల అమలుకు సిద్ధమయ్యాయని, దాదాపు 100 కంపెనీలు స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియను ప్రారంభించాయని ఆయన వివరించారు.
2018లో వ్యక్తిగత దివాలా నిబంధనావళి అమలు, కార్పొరేట్ దివాలా లావాదేవీ ప్రక్రియను సరళతరం చేయడం మొదలైన వాటికి ఐబీబీఐ ప్రాధాన్యమివ్వనున్నట్లు సాహూ చెప్పారు. తొలి దశలో దివాలా ప్రక్రియ పరిధిలోని కార్పొరేట్లకు హామీదారులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి ఇన్సాల్వెన్సీ నిబంధనలను అమల్లోకి తెస్తామని తెలిపారు. ఆ తర్వాత వ్యాపారాలు చేస్తున్న (ప్రొప్రైటర్షిప్ లేదా పార్ట్నర్షిప్ సంస్థలు) వ్యక్తులకు కూడా వీటిని విస్తరిస్తామని పేర్కొన్నారు.