సైరస్‌ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్‌ | Cyrus Mistry actions hurt Tata group interests, Tata Sons tells SC | Sakshi
Sakshi News home page

సైరస్‌ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్‌

Jan 3 2020 3:31 AM | Updated on Jan 3 2020 3:31 AM

Cyrus Mistry actions hurt Tata group interests, Tata Sons tells SC - Sakshi

న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్‌ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది.  చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్‌ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్‌సీఎల్‌ఏటీలో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది.

జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్‌ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్‌ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్‌ క్యాపిటల్‌ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధంతరంగా టాటా  సన్స్‌ చైర్మన్‌ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలంటూ 2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్‌సీఎల్‌ఏటీ.. టాటా సన్స్‌ను పబ్లిక్‌ నుంచి ప్రైవేట్‌ కంపెనీగా మార్చడంలో ఆర్‌వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్‌.. సుప్రీం కోర్టును, అటు ఆర్‌వోసీ.. ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement