కరోనా, క్యూ4 ఫలితాలు కీలకం | Sakshi
Sakshi News home page

కరోనా, క్యూ4 ఫలితాలు కీలకం

Published Mon, Apr 20 2020 4:21 AM

Analyst expectations on the market - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కేసులు, కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే కీలకాంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తోందన్న ఆశలు ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి లాక్‌డౌన్‌ దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాలున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా ఆరంభమవుతాయనే అంచనాలు మార్కెట్లో సెంటిమెంట్‌కు జోష్‌నివ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గమనం, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, ఏసీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, అలెంబిక్‌ ఫార్మా, మైండ్‌ట్రీ తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి.  కాగా, కరోనా వైరస్‌ ప్రభావం తమ వ్యాపారాలపై ఎలా ఉండనున్నదనే విషయమై కంపెనీలు వెల్లడించే అంచనాలపైననే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి.

బోర్డ్‌ మీటింగ్స్‌
ఇన్ఫోసిస్, టాటా ఎలెక్సీ, ఆదిత్య బిర్లా మనీ, లిండే ఇండియా

2 గంటల్లో సెటిల్‌ చేయండి
ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై ఐఆర్‌డీఏఐ ఆదేశం  
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల విషయంలో రెండు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. కరోనా వైరస్‌ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా సెటిల్‌ చేయాలని బీమా సంస్ధలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆథరైజేషన్‌ రిక్వెస్ట్‌ అందిన రెండు గంటలలోపు సంబంధిత(నెట్‌వర్క్‌) హాస్పిటల్‌కు క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌కు ఆమోదం తెలుపుతూ సమాచారమివ్వాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

Advertisement
Advertisement