
కాబోయే భర్తను మోసం చేయలేక....
నోటి నుంచి రక్తం వస్తుండటంతో తనకు క్యాన్సర్ ఉందనుకుందో యువతి. త్వరలో పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మోసం చేయడం ఇష్టంలేక...
ఆదిలాబాద్ : నోటి నుంచి రక్తం వస్తుండటంతో తనకు క్యాన్సర్ ఉందనుకుందో యువతి. త్వరలో పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మోసం చేయడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి పెట్టింది. ఈ సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో జరిగింది. టూటౌన్ ఎస్ఐ రాము కథనం ప్రకారం... పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, లక్ష్మీ దంపతులు కూలీలు. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురికి వివాహం చేయగా,రెండో కుమార్తె అపర్ణ (18) ఇంటర్మీడియేట్ పూర్తి చేసింది.
మండలంలోని అనుకుంటకు చెందిన యువకుడితో అపర్ణ వివాహ నిశ్చయం ఈ నెల 17న జరిగింది. మరో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుందామనుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అపర్ణ తల్లిదండ్రులు పెళ్లి పనులకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి మార్కెట్కు వెళ్లారు. మూడు రోజులుగా నోటినుంచి రక్తం పడుతుండటంతో అపర్ణ ఆందోళనకు గురైంది.
మంగళవారం కూడా రక్తం రావటంతో కంగారుపడింది. అదే సమయంలో ఇంటి పక్కనున్నవారు గమనించి 'ఏం కాదులే...' అంటూ ధైర్యం చెప్పారు. పదే పదే నోటి నుంచి రక్తం రావటంతో తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని మనస్తాపం చెందిన అపర్ణ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది.