తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ను వదులుకునే ప్రసక్తేలేదని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
సంగారెడ్డి/హైదరాబాద్, న్యూస్లైన్ : తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ను వదులుకునే ప్రసక్తేలేదని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్, హైదరాబాద్లోని టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం కొనసాగేందుకు కేంద్రం నాన్చుడు ధోరణే కారణమన్నారు. ఏపీఎన్జీవోల నేత ‘అబద్ధాల అశోక్బాబు’ అని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కూడా ఉద్యమంలో పాల్గొంటున్నట్టుగా ప్రభుత్వం అధిష్టానానికి నివేదిక అందిస్తోందని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మెలో ప్రభుత్వం అనుసరించే విధానాన్నే సీమాంధ్ర ఉద్యమానికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే నినాదాన్ని సభ విజయవంతం ద్వారా సీమాంధ్రులకు తెలియజేయాలన్నారు. 29న నిర్వహించే సకలజన భేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న వరంగల్, 27న నల్లగొండలో భారీ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సకల జనభేరి పోస్టర్ను దేవీప్రసాద్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
అశోక్ బాబూ.. జాగ్రత్త : శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్: తెలంగాణ ఉద్యమంపై.. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. మహబూబ్నగర్లోని టీఎన్జీవో భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎన్జీవోలది ముమ్మాటికీ ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమమే అని పేర్కొన్నారు. సీమాంధ్రుల గురించి మాట్లాడితే తమ గౌరవాన్ని కించపరుచుకున్న వారమవుతామని చెప్పారు. తెలంగాణ ప్రకటించి 53 రోజులు అవుతున్నా.. ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ మరోసారి మోసం చేసే అవకాశాలున్నందున, కాంగ్రెస్ నేతలు మేల్కొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.