ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి... ప్లీజ్ | woman request to east godavari district police due to marriage with boyfriend | Sakshi
Sakshi News home page

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి... ప్లీజ్

Apr 16 2014 8:48 AM | Updated on Sep 2 2017 6:07 AM

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి... ప్లీజ్

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి... ప్లీజ్

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమెకు న్యాయం జరగకపోగా.. యువకుడి బంధువులు ఆమెపై దాడికి తెగబడ్డారు.

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమెకు న్యాయం జరగకపోగా.. యువకుడి బంధువులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం లక్కవరానికి చెందిన రుద్ర సత్యనారాయణ మూర్తి ధాన్యం కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కోసం రామేశ్వరానికి చెందిన అడబాల జ్యోతి తండ్రి వద్దకు అతడు వచ్చేవాడు. ఈ క్రమంలో సత్యనారాయణమూర్తి, జ్యోతి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
 
 2011 డిసెంబర్ నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు జ్యోతిని వంచించాడు. పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా.. తన తల్లిదండ్రులు ఒప్పుకోవాలని బదులిచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తన పెద్దలకు చెప్పింది. రూ.5 లక్షలు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని యువకుడి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో అంగీకరించారు. ఆమె తండ్రి అప్పు చేసి, కట్నం సొమ్ము సిద్ధం చేయగా, సత్యనారాయణ మూర్తి ముఖం చాటేశాడు. ఐదు నెలలుగా పెద్దల వద్దకు తిరిగినా ఫలితం లేకపోవడంతో.. ఆమె రెండు నెలల క్రితం సఖినేటిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
 అతడు ఉండే గ్రామం తమ పరిధిలోనిది కాదని చెప్పడంతో, మలికిపురం పోలీసులను ఆశ్ర యించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నెల ఏడో తేదీన పెద్దలతో కలిసి సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన బాధితురాలిపై అతడి బంధువులు దాడి చేసి గాయపరిచారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితురాలితో పాటు ఆమె తల్లి నాగవేణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మలికిపురం ఎస్సై ఎస్‌కే సాదిఖ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement