
స్వదేశంలో పనిచేస్తే.. అగ్రస్థానంలో ఉంటాం
ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో ప్రతి ఏటా కనీసం వెయ్యి మంది విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారనీ, అలాకాకుండా..
నిట్ టెక్నోజియాన్ ముగింపు కార్యక్రమంలో ఈసీఐఎల్ చైర్మన్ పి.సుధాకర్
హన్మకొండ : ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో ప్రతి ఏటా కనీసం వెయ్యి మంది విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారనీ, అలాకాకుండా.. వారంతా స్వదేశంలో పనిచేస్తే శాస్త్రసాంకేతిక రంగాల్లో మనదేశం అగ్రరాజ్యాన సరసన నిలుస్తుందని ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ అన్నారు. వరంగల్ నిట్లో టెక్నోజియాన్ -2014 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లోనే సాంకేతిక సహకారం అవసరమయ్యేదన్నారు. నేటి గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ప్రతి అంశంలోనూ సాంకేతిక సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులు తమ జీవితాన్ని ఓ ప్రయోగశాలగా భావించాలనీ, అప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా యువ ఇంజనీర్లు ఎదగాలని ఆకాంక్షించారు.
నేటి ఎన్నికల వ్యవస్థ్యను సరళతరం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం)ను రూపొందించింది ఈసీఐఎల్లోనే అని తెలిపారు. త్వరలో 700 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ప్లాంట్ను ఈసీఐఎల్ ఆధ్వర్యంలో దేశంలో నెలకొల్పనున్నట్లుగా వెల్లడించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అగ్ని మిసైల్ ప్రోగాంై డెరెక్టర్ వీజే శేఖరన్ మాట్లాడుతూ నానో టెక్నాలజీకి అనుగుణంగా రాబోయే రోజుల్లో సరికొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.అగ్ని, ఆకాశ్, అస్త్రా క్షిపణుల పనితీరును విద్యార్థులకు వివరించారు. వరంగల్ నిట్లో మూడు రోజుల పాటు జరిగిన టెక్నోజియాన్ -2014కు అంచనాలకు మించి స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది విద్యార్థులు ఈ టెక్నికల్ ఫెస్ట్కు వస్తారని అంచనా వేయగా... అంతకు రెట్టింపు సంఖ్యలో 6,500 మంది హాజరయ్యారు. నిట్ విద్యార్థులతో కలిపి మొత్తం పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో నిట్ ప్రాంగణం కళకళలాడింది.