నీటి యుద్ధాలు ప్రారంభం | Water wars begin | Sakshi
Sakshi News home page

నీటి యుద్ధాలు ప్రారంభం

Feb 25 2015 1:34 AM | Updated on Sep 2 2017 9:51 PM

రబీ పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం యుద్ధాలు ప్రారంభమయ్యాయి.

మర్లగుమ్మి నీటికోసం రైతుల మధ్య వాదన
ఇదే విషయమై గతేడాదీ కొట్లాట
కోనాం నీటి విడుదలకు  అధికారుల హామీ

 
చోడవరం: రబీ పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వరహాపురం మీదుగా కొండ గెడ్డలోవచ్చే కోనాం జలాశయం నీటి కోసం చీడికాడ మండలం వరహాపురం, చోడవరం మండలం దామునాపల్లి, మైచర్లపాలెం గ్రామాల రైతుల మధ్య మంగళవారం వివాదం నెలకొంది. దామునాపల్లి, మైచర్లపాలెం పరిధిలోని భూములకు నీరందించేందుకు మర్లగుమ్మి చానల్ ప్రత్యేక కాలువ ఉంది.  దీనిద్వారా చివ రి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో దామునాపల్లి, మైచర్లపాలెం ప్రాంతాల్లో చెరకు, రబీవరి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వరహాపురం పొలాల మీదుగా మర్లగుమ్మి ఛానల్ స్లూయీస్ నుంచి ప్రవహించే  కొండగెడ్డ తమ పొలాల మీదుగా ప్రవహిస్తున్నందున, ఆ నీటిని తమకు కూడా ఇవ్వాలని రెండు గ్రామా ల రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము వినియోగించుకోగా మిగిలిన కొండగెడ్డ నీరు దిగువప్రాంతానికి వెళ్తుందని వరహాపురం రైతులు వాది స్తున్నారు. ఈ వివాదం ఇరు ప్రాంతాల రైతుల మధ్య మూడేళ్లుగా సాగుతోంది.

గతేడాది కొట్లాటకు దారితీసింది. సాగునీటి కొరత ఏర్పడటం వల్ల వారిమధ్య మళ్లీ వివాదం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొండగెడ్డకు నిర్మించిన చెక్‌డ్యాం స్లూయీస్‌లను కాంక్రీట్‌తో మూసి, దిగువకు నీరు రా కుండా చేశారని  దామునాపల్లి, మైచర్లపాలెం ప్రాంతాల రైతులు పోలీసు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోనాం జలాశయం డిప్యూటీ ఇంజనీర్ కె.మాధవి, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కనిశెట్టి మచ్చిరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వేసిన కాంక్రీట్‌ను తొలగించాలని డీఈ ఆదేశించారు. నీరు దిగువప్రాంతానికి వెళ్లేలా వెంటనే మైచర్లపాలెం, దామునపల్లి రైతులు కాంక్రీట్ దిమ్మలను కొద్దిగా తొలగించారు.

ఇది అన్యాయమంటూ వరహాపురం రైతులు అధికారులను అడ్డగించారు. తాము ఎంతో ఖర్చుపెట్టి, కాలువల్లో పూడిక తీసి నీరు తెచ్చుకున్నామని, అలాంటిది ఇప్పుడు దిగువ ప్రాంతానికి ఎలా నీరు ఇస్తారని ధ్వజమెత్తారు. వెంటనే కోనాం నీరును మర్లగుమ్మి ఛానల్ ద్వారా కొండగెడ్డలోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతుల ఎవరి వాదన వారు అధికారులకు వినిపించారు. జలాశయం నీరు విడుదల చేస్తామని డీఈ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement