వారిద్దరిపై కేసు నమోదు చేయండి

Vijaya Sai Reddy Complaint on Chandrababu and ABN Radhakrishna - Sakshi

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు  

తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టిస్తున్నారు 

సాక్షి,హైదరాబాద్‌/ సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలు నిబద్ధత లేనివారంటూ తాను మాట్టాడినట్లుగా డబ్బింగ్‌ వాయిస్‌ను సృష్టించి తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు  ప్రయత్నించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించేందుకు ప్రయిత్నిస్తున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ  వేమూరి రాధాకృష్ణ , కుట్రలో మరో భాగస్వామి ఏపీ సీఎం చంద్రబాబుపైన క్రిమినల్‌ కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ తరఫున చల్లా «మధుసూదన్‌రెడ్డి ఈ ఫిర్యాదును ఆదివారం పోలీసులకు అందజేశారు. టీడీపీకి అమ్ముడుపోయిన వేమూరి రాధాకృష్ణ తన వాయిస్‌ అంటూ తనది కాని వాయిస్‌ను తన చానల్‌లో ప్రసారం చేయడంతో పాటు తన పత్రికలోనూ ప్రచురించి తన పరువు తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి), సెక్షన్‌ 153 (ఏ), 171(సి) 171(హెచ్‌), 420, 123,125 రిప్రజెంటేషన్‌ పీపుల్స్‌ యాక్ట్‌ 1951 కింద క్రిమినల్‌ కేసు  నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో తెలిపారు.

ఈ నెల 5వ తేదీన తనదికాని వాయిస్‌తో ఏబీఎన్‌ ఛానల్‌లో ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు అన్నట్లుగా ప్రసారం చేసి తనతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని,  శనివారం కూడా ఈ అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ చర్చావేదికలో పాల్గొన్నవారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.  ఆధారాలు లేకుండా ప్రసారం చేసిన అంశంపైన తన వాయిస్‌ను డబ్బింగ్‌ చేసిన విధానంపై  తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కుట్ర వెనక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించి తప్పుడు ప్రచారం చేశారని, తెలుగు ప్రజల మనోభావాలు దీని వల్ల దెబ్బతిన్నాయని ఆయన పేర్కొంటూ ఈ నెల 5,6 తేదీల్లో ఆ చానల్‌లో  తనపై వచ్చిన ప్రసారాల ఆడియో టేపులను, ఈనెల 7న ఆంద్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు జతచేశారు. 

న్యాయ సలహా కోసం పంపుతున్నాం: ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డి  
ఏబీఎన్‌ ఎండి వేమూరి రాధాకృష్ణపై  వైఎస్సార్‌సీపీ నేత  విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై  న్యాయ సలహా కోసం పంపుతున్నామని జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డి చెప్పారు. న్యాయ సలహా అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.  ఛానల్‌లో ప్రసారమైన ఆడియో, వీడియో పత్రికల్లో కథనాల క్లిప్పింగ్‌లు ఫిర్యాదుతో జతపరిచామని తెలిపారు.  

రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ సీపీ ఫిర్యాదు  
అధికార తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఇరు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎల్లో మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. మిమిక్రీ ద్వారా దొంగ వాయిస్‌తో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏబీఎన్‌ చానల్‌ తప్పుడు వార్తలు ప్రసారం చేసిందంటూ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తరఫున పార్టీ నేతలు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, గౌతమ్‌ రెడ్డి  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top